
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్లతో పాటు విదేశీ టాప్ ఆటగాళ్లు బరిలో ఉండటంతోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ సారి లీగ్ విషయంలో నిర్వహకులకు చిన్న సమస్య ఎదురుకానుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు లీగ్ తొలి వారంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు దూరం కానున్నారు. సెప్టెంబర్ 16 వరకు ఆ రెండు జట్ల మధ్య సిరీస్ జరగనుండడమే ఇందుకు కారణం.
ఈ సీజన్ లీగ్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరుగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా, ఇంగ్లండ్, ఆసీస్ మధ్య సెప్టెంబర్ 16న చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఐపీఎల్లో ఆడే ఇరు జట్లు ఆటగాళ్లు అదే రోజున దుబాయ్ బయలుదేరే అవకాశముంది. యూఏఈలో అడుగుపెట్టిన తర్వాత కరోనా టెస్ట్ చేయించుకుని రిజల్ట్ వచ్చేదాకా ప్లేయర్లు ఐసోలేషన్ జోన్లోనే ఉండాలి.
ఇదంతా పూర్తి కావడానికి సుమారు మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత కూడా ప్లేయర్లు నేరుగా టీమ్లో కలవడానికి వీల్లేదు. బీసీసీఐ రూపొందిస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం జట్టుతో చేరాలి. ఓవరాల్గా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 7-10 రోజులు పడుతుంది. దీంతో ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు తొలివారం రోజుల మ్యాచ్లకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లీగ్ వీదేశీ ఆటగాళ్ల జాబితాలో ఈ రెండు దేశాల ఆటగాళ్లదే మెజార్టీ వాటా. ఆస్ట్రేలియా(17), ఇంగ్లండ్(11) నుంచి మొత్తం 28 మంది ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఆరంభంలో వీరు అందుబాటులో ఉండరనే వార్తలతో ఆయా ఫ్రాంచైజీలు,అభిమానులకు కలవరపడుతున్నారు.