సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను ఆతిథ్య ఆస్ట్రేలియా 4-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్ల సిరీస్లో ఆసీస్ నాలుగు గెలవగా.. ఇంగ్లండ్ ఓ మ్యాచ్ డ్రా చేసుకొని క్లీన్ స్వీప్ ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ సిరీస్ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఓడిన బాధలో ఇంగ్లండ్ ఆటగాళ్లు కలిసి మందేసారు. చివరి టెస్ట్ వేదికైన హోబర్ట్లోని ఓ హోటల్లో అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు శ్రుతిమించి తాగారు. మైకంలో హద్దులు ధాటి ప్రవర్తించారు. ఎంతలా అంటే పోలీసులు రంగంలోకి దిగి హెచ్చరించేంత అల్లరి చేశారు.
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, పేసర్ జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ క్యారీ, నాథన్ లయన్, ట్రావిస్ హెడ్ సహా పలువురు ఆటగాళ్లు హోటల్లో పీకల్దాక తాగి రచ్చ చేశారు. వారి అల్లరికి విసిగిపోయిన హోటల్లోని ఇతరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఆటగాళ్లను అక్కడి నుంచి పంపించేసారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
The first and last time #Hobart will host an #Ashes test… ‘Bit too loud’ .. Awesome pic.twitter.com/zdZ4dmcsf6
— Matt de Groot (@mattdegroot_) January 18, 2022
ఈ వీడియోలో పోలీసులు..'అల్లరి మరీ ఎక్కువైంది. మీరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు అందింది. అందుకే మేం ఇక్కడకు వచ్చాం' అని వార్నింగ్ ఇవ్వడం కనిపించింది. 'పడుకునే టైమ్ అయింది. వెళ్లి నిద్రపోండి' అని ఆటగాళ్లను గట్టిగానే హెచ్చరించారు. అయితే.. ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనపై ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) విచారణకు ఆదేశించింది.
ఇక సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు క్రేజ్ ఉందని, ఆటగాళ్లను చాలా మంది యువత ఆరాధ్య దైవంగా భావిస్తుందని, అలాంటి స్టార్ క్రికెటర్లు ఇలా హద్దులు ధాటి ప్రవర్తిస్తే వారు ఎలా అర్థం చేసుకుంటారు? అనే విమర్శలు వస్తున్నాయి. సోయి మరిచేదాకా తాగి, ఇబ్బందులు తెచ్చుకోవద్దని ఇరు జట్ల అభిమానులు తమ ఆటగాళ్లకు సూచిస్తున్నారు.
ఈ సిరీస్లో ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. వరుసగా మూడు విజయాలతో మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకున్న కమిన్స్ సేన.. నాలుగో టెస్ట్ డ్రా అయినా చివరి మ్యాచ్లో గెలిచింది.