ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక విజయంతో ముగించింది. మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఓవల్ మైదానం వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్ట్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(124 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 127 నాటౌట్) అజేయ శతకంతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
చివరి టెస్ట్లో ఓడినా.. తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. నాలుగు రోజుల పాటు జరిగిన మూడో టెస్ట్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 40.3 ఓవర్లలోనే 2 వికెట్లకు లక్ష్యాన్ని చేధించింది. మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే(8) విఫలమవ్వగా.. కుశాల్ మెండీస్(39), ఏంజెలో మాథ్యూస్(32 నాటౌట్) సాయంతో పాతుమ్ నిస్సంక విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఓలిపోప్(154) సెంచరీతో రాణించగా.. బెన్ డక్కెట్(86) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో మిలాన్ రత్ననాయకే(3/56) మూడు వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమారా, ధనుంజయ డిసిల్వా రెండేసి వికెట్లు తీసారు. అసితా ఫెర్నాండోకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిస్సంక(64), ధనుంజయ డిసిల్వా, కామిందు మెండీస్(64) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ హుల్, ఓల్లీ స్టోన్ మూడేసి వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. షోయబ్ బషీర్ ఓ వికెట్ తీసాడు.
58 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్.. అనూహ్యంగా 156 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు లాహిరు కుమారా(4/21), విశ్వా ఫెర్నాండో(3/40) సత్తా చాటడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. జేమీ స్మిత్(67) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో శ్రీలంక ముందు 219 పరుగుల లక్ష్యం నమోదైంది. పాతుమ్ నిస్సంక ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు తేలిపోయారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ మాత్రమే తీసారు.
శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన పాతుమ్ నిస్సంక(64, 127 నాటౌట్)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్లో శతకాల మోత మోగించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్(375 రన్స్, 1 వికెట్)కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు.