ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో జేమీ స్మిత్(148 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 111) సెంచరీ సాధించాడు. కెరీర్లో జేమీ స్మిత్కు ఇదే తొలి సెంచరీ. దాంతో ఇంగ్లండ్ తరఫున శతకం సాధించి అతి పిన్న వికెట్ కీపర్గా జేమీ స్మిత్ చరిత్రకెక్కాడు.
జేమీ స్మిత్ 24 ఏళ్ల 42 రోజుల వయస్సులో శతకం సాధించాడు. తద్వారా 94 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి ఈ రికార్డ్ దిగ్గజ వికెట్ కీపర్ లెస్ అమెస్ పేరిట ఉండేది. 1930లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అమెస్ ఈ ఫీట్ సాధించాడు.

గత 94 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డ్ను స్మిత్ అధిగమించాడు. స్మిత్ సెంచరీతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. అతనికి తోడుగా హ్యారీ బ్రూక్(56) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/103) నాలుగు, ప్రభాత్ జయసూర్య(3/85) మూడు వికెట్లు తీయగా..విశ్వ ఫెర్నాండో(2/73) రెండు వికెట్లు పడగొట్టాడు. మిలాన్కు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 236 పరుగులకు కుప్పకూలింది. ధనుంజయ డిసిల్వా(74), మిలాన్ రథనాయకే(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ మూడేసి వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. 122 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కామిందు మెండీస్(34 బ్యాటింగ్), ఏంజెలో మాథ్యూస్(65 బ్యాటింగ్) ఉన్నారు.