ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లండ్ నిరాశజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన ఇంగ్లీష్ టీమ్.. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ తేలిపోయింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ మార్కో జాన్సెన్స్(3/39), వియాన్ మల్డర్(3/25) నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 38.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. జోరూట్(44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 37) టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఓపెనర్లు ఫిల్ సాల్ట్(8), బెన్ డకెట్(24) తీవ్రంగా నిరాశపర్చగా.. జెమీ స్మిత్(0) డకౌటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన హ్యారీ బ్రూక్(19), జోస్ బట్లర్(21), జోరూట్(37)తో పాటు లియామ్ లివింగ్ స్టోన్(9), జేమీ ఓవర్టన్(11) తీవ్రంగా నిరాశపరిచారు. జోఫ్రా ఆర్చర్(25) కాసేపు పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆదిల్ రషీద్(2) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, వియాన్ మల్డర్లు మూడేసి వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, కగిసో రబడా తలో వికెట్ తీసారు. మార్కో జాన్సెన్ బౌలింగ్ ప్రదర్శనపై పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో మార్క్ జాన్సెన్ను పంజాబ్ కింగ్స్ రూ. 7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో సౌతాఫ్రికా.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా గ్రూప్-బీ నుంచి సెమీస్ బెర్త్ దక్కించుకుంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఇంగ్లండ్ బ్యాటర్లు చెత్త షాట్లతో పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్గా జోస్బట్లర్కు ఇది చివరి మ్యాచ్ కాగా.. అతనికి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. అసాధారణ బౌలింగ్ ప్రదర్శన చేస్తే తప్పా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచే అవకాశం లేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన జట్టుగా ఇంగ్లండ్ చెత్త రికార్డ్ నమోదు చేయనుంది.