
మాంచెస్టర్: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మరెవరికీ సాధ్యంకాని రికార్డును అందుకున్నాడు. సొంతగడ్డపై 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా అండర్సన్ చరిత్రకెక్కాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్తో అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. సచిన్ సొంతగడ్డపై 94 మ్యాచ్లు మాత్రమే ఆడి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్వదేశంలో 92 టెస్టులతో మూడో స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 91 టెస్ట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. అండర్సన్ తర్వాత స్వదేశంలో వంద టెస్టులు ఆడే అవకాశం ప్రస్తుతం స్టువర్ట్ బ్రాడ్కు మాత్రమే ఉంది. ఇటీవలే 40వ వసంతంలోకి అడుగుపెట్టిన అండర్సన్.. వయసు మీద పడుతున్నా బౌలింగ్లో మాత్రం పదును అలాగే ఉండడం విశేషం.
ఇక 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అండర్సన్ ఇంగ్లండ్ తరపున 174 టెస్టులాడి 658 వికెట్లు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అండర్సన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(800 వికెట్లు) ఉండగా.. రెండో స్థానంలో ఆసీస్ దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు) ఉన్నాడు.
మూడు టెస్టుల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రారంభమైన రెండో టెస్టును మాత్రం సానుకూలంగా ప్రారంభించింది. టాస్ ఓడి ఫీల్డింగ్కు దిగిన ఇంగ్లండ్ బౌలర్లు దుమ్మురేపడంతో లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ 3 వికెట్లతో చెలరేగగా.. స్టోక్స్, బ్రాడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.