పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాజీ చైర్మెన్, దిగ్గజ క్రికెటర్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో గురువారం జరిగిన నాలుగో టీ20లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్తో కనీస పోటీని ఇవ్వలేకపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజామ్(22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 36), ఉస్మాన్ ఖాన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(2/35), ఆదిల్ రషీద్(2/27), లివింగ్ స్టోన్(2/17) రెండేసి వికెట్లతో సత్తా చాటారు.

అనంతరం ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి 27 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఫిల్ సాల్ట్(24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 45), జోస్ బట్లర్(21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 39) రాణించారు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్ ఒక్కడే మూడు వికెట్లు తీసాడు. ఈ ఓటమితో నాలుగు టీ20 మ్యాచ్ల సిరీస్ను పాకిస్థాన్ 0-2తో కోల్పోయింది.
ప్రయోగాలు ఆపండి..
ఈ పరాజయంపై రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్చి ప్రయోగాలతో జట్టును నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఈ అనవసర ప్రయోగాలు ఆపాలని, స్ట్రైక్రేట్ ఫోబియా నుంచి బయటపడాలని హితవు పలికాడు.
'ముందుగా ఈ పిచ్చి ప్రయోగాలను ఆపండి. సరైన కాంబినేషన్తో బరిలోకి దిగండి. అలాగే స్ట్రైక్రేట్ ఫోబియా నుంచి బయటపడండి. ఎందుకంటే భారీ స్ట్రైక్రేట్తో చెలరేగే ఆటగాళ్లు పాకిస్థాన్లో లేరు. ఓపెనింగ్ కాంబినేషన్ను మార్చి మంచి జట్టును నాశనం చేశారు.
ఇద్దరు కీపర్లు ఎందుకు..?
మిడిలార్డర్లో సరైన ఆటగాడు లేడు. ఆల్రౌండర్స్తో మిడిలార్డర్ను నింపేసారు. తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఆడుతున్నారు. ఫాస్ట్ బౌలర్లను తరుచూ మారుస్తున్నారు. పాకిస్థాన్ స్పిన్నర్లు అయితే బంతిని స్పిన్ చేయడం లేదు. ఆటగాళ్లలో ఎవరికి ఆత్మవిశ్వాసం లేదు. ఇమాద్ వసీమ్ బాగా రాణించినా.. అతన్ని పక్కనపెట్టారు. మైదానంలో ఆటగాళ్లు చురుగ్గా కదలడం లేదు.
బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ల జోడీ పాకిస్థాన్ జట్టుకు చాలా ముఖ్యం. ఇంగ్లండ్పై అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి వారు తమ సత్తాను చూపించారు. ఈ ఇద్దరిని ఓపెనింగ్ జోడీగా పంపాలి. ఎందుకంటే ఈ ఇద్దరే పాకిస్థాన్ బలం. స్ట్రైక్రేట్లపై ఫోకస్ పెట్టి భాగస్వామ్యాల విలువను విస్మరిస్తున్నారు.
ఆజామ్ ఖాన్ అనవసరం..
బాబర్, రిజ్వాన్ను ఓపెనర్లుగా ఆడించడం పాకిస్థాన్ జట్టుకు సురక్షితం. ఈ ఇద్దరిని ఓపెనర్లుగా ఆడించి మిగతా కాంబినేషన్ను పరీక్షించుకోవాలి. మహమ్మద్ రిజ్వాన్తో వికెట్ కీపింగ్ చేయించడంతో పాటు ఓపెనర్గా ఆడించాలి. బాబర్ ఆజామ్ కూడా ఓపెనర్గా బరిలోకి దిగాలి. అప్పుడు ఆజామ్ ఖాన్ స్తానంలో ఎక్స్ట్రా ఆల్రౌండర్ లేదా స్పెషలిస్ట్ బ్యాటర్తో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది.'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.