
ముంబై: టీ20 ప్రపంచకప్లో భాగంగా నేడు మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే సెమీ ఫైనల్-1 మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. మెగా టోర్నీల్లో టీమిండియాకు ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఎలా ఉన్నాడో.. న్యూజిలాండ్కు కూడా కుమార ధర్మసేన అనే కలిసిరాని అంపైర్ ఉన్నాడు. ఇంగ్లండ్తో 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ అసంబద్దమైన బౌండరీ కౌంట్ రూల్తో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు టై కావడం.. సూపర్ ఓవర్కు దారితీయడం.. అది కూడా టై అవ్వడంతో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్కు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేననే అంపైర్గా వ్యవహరించాడు. ముఖ్యంగా చేజింగ్లో ఇంగ్లండ్కు అప్పనంగా వచ్చిన 6 పరుగుల సిగ్నల్ను ధర్మసేననే ఇచ్చాడు. బెన్ స్టోక్స్ కొట్టిన బంతిని న్యూజిలాండ్ ఫీల్డర్ కీపర్ వైపు త్రో విసరగా.. అది స్టోక్స్ బ్యాట్ను తాకి బౌండరీ వెళ్లింది. దాంతో ఇంగ్లండ్కు అదనంగా 4 పరుగులు లభించాయి. చివరకు ఆ పరుగులే న్యూజిలాండ్ పతనాన్ని శాసించాయి. ఈ క్రమంలోనే నాటి క్షణాలను గుర్తు చేస్తూ వసీం జాఫర్ సెటైరిక్గా ట్వీట్ చేశాడు.
'హే.. కుమార్.. ఈరోజు మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది. నువ్వు ఈ మ్యాచ్లో అంపైరింగ్ చేస్తున్నావంటే న్యూజిలాండ్ ఇక గెలవడం కష్టమే ' అంటూ 2019 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో అంపైర్ ధర్మసేన సిక్స్ సిగ్నల్ ఇస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ ఇంగ్లండ్ దొడ్డిదారిన విశ్వవిజేతగా నిలిచిందని నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు. ఆ ప్రపంచకప్ న్యూజిలాండ్దేనంటారు. ప్రస్తుతం జాఫర్ షేర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
ఇక నేటి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి నాటి 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరో వైపు ఇంగ్లండ్ సైతం వన్డే ప్రపంచకప్ మాదిరే టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకోవాలనుకుంటుంది.