
లార్డ్స్: మూడు టెస్ట్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ పట్టుబిగించింది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 132 పరుగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టు బౌలర్ల దాటికి నిలవలేక కివీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్తోనే ఇంగ్లండ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన జేమ్స్ అండర్సన్(4/66), అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్(4/13) నాలుగేసి వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు.
ఈ ఇద్దరి ధాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు వరుసగా 1,1, 2, 3, 13, 14, 42,6, 26, 7, 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు టామ్ లాథమ్(1), విల్ యంగ్(1)లను అండర్సన్ ఔట్ చేయగా.. విలియమ్సన్(2 ) మాథ్యూ ప్యాట్స్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. డేవాన్ కాన్వే(3) స్టువర్ట్ బ్రాడ్ ఔట్ చేయగా.. డారిల్ మిచెల్, టామ్ బండెల్లను పాట్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో న్యూజిలాండ్ 36 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దాంతో 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ కొలిన్ గ్రాండ్ హోమ్(42 నాటౌట్) ఒంటి పోరాటం చేయడంతో కివీస్ పరువు కాపాడుకుంది. అతనికి టీమ్ సౌథీ(26) అండగా నిలిచాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఈ ఇద్దరే టాప్ స్కోరర్లు.
ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, మాథ్యూ పాట్స్ నాలుగేసి వికెట్లు తీయగా.., స్టువర్ట్ బ్రాడ్ ఒకటి, బెన్ స్టోక్స్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మూడో సెషన్ టీ బ్రేక్ సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. ఇంకా 52 పరుగుల వెనుకంజలో ఉంది. జాకీ క్రాలీ(43) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.