
క్రీడా స్పూర్తిని విస్మరించలేకనే..
అయితే ఇంగ్లండ్ విధించిన లక్ష్యచేధనలో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ను డేవాన్ కాన్వేతో కలిసి డారిల్ గట్టెక్కించాడు. కాన్వే ఔటైనా.. జిమ్మీ నీషమ్ ధాటైన ఇన్నింగ్స్తో విజయ తీరాలకు చేర్చాడు. అయితే ఆదిల్ రషీద్ వేసిన 18వ ఓవర్లో డారిల్ కనబర్చిన క్రీడాస్పూర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ ఓవర్లో పరుగు తీసే క్రమంలో ఆదిల్ రషీద్ను డీకొట్టిన డారిల్ మిచెల్ ప్రత్యర్థి బ్యాట్స్మన్ సింగిల్కు పిలవగా నిరాకరించాడు.
క్రీడాస్పూర్తిని విస్మరించి వివాదం స్పష్టించడం ఇష్టం లేకనే ఆ సింగిల్కు నిరాకరించానని డారిల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. అయితే ఆ నిర్ణయం తనకు కలిసొచ్చిందని, తమ జట్టు విజయానికి మరింత చేరువైందన్నాడు. ఆ మరుసటి బంతినే డారిల్ భారీ సిక్సర్ బాదాడు.

అదృష్టవశాత్తు..
'రషీద్ను ఢీకొట్టిన తర్వాత సింగిల్ తీసే ఆస్కారం ఉన్నా నేను నిరాకరించా. వివాదంలో చిక్కుకోవడం ఇష్టం లేకనే అలా చేశా. నేను చేసిన పని నాకు మంచే చేసింది. సింగిల్ నిరాకరించడం ఫలితంపై ప్రభావం చూపలేదు. టోర్నీ ఆసాంతం మేమంతా క్రీడా స్పూర్తితో ఆడాం. రషీద్ను ఢీకొట్టడం నా తప్పుగా భావించా. అందుకే సింగిల్ తీయలేదు.
న్యూజిలాండ్ తరఫున బరిలోకి దిగడం నా అదృష్టంగా భావిస్తున్నా. సుదీర్ఘ కాలం డొమెస్టిక్ క్రికెట్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం నాకు మంచి చేసింది. అపారమైన అనుభవం లభించింది. 'అని మిచెల్ చెప్పుకొచ్చాడు. ఇక 7-8 ఏళ్ల డొమెస్టిక్ కెరీర్ తర్వాత మిచెల్ 27 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.

16 ఓవర్ల దాకా ఇంగ్లండ్దే పైచేయి..
కివీస్ లక్ష్యఛేదనలో 16 ఓవర్ల దాకా ఇంగ్లండ్దే పైచేయి. తర్వాత మూడు ఓవర్లు, నీషమ్ మెరుపులు మోర్గాన్ బృందం ఆశలను తలకిందులు చేశాయి. దీంతో ఇంకో ఓవర్ మిగిలుండగానే న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తమకు ఐసీసీ ప్రపంచకప్లను దూరం చేస్తున్న ఇంగ్లండ్ను ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో కివీస్ కసిదీరా ఓడించి మరీ ఫైనల్ చేరింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 51 నాటౌట్), డేవిడ్ మలాన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 41) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు.

ఆదుకున్న కాన్వే, డారిల్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ డరిల్ మిచెల్(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అతనికి అండగా డేవాన్ కాన్వే(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 46) రాణించాడు.
ఈ ఇద్దరు మూడో వికెట్కు 82 పరుగుల జోడించారు. 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సమయోచిత బ్యాటింగ్తో విజయతీరాలకు చేర్చారు. చివర్లో జిమ్మీ నీషమ్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 27) పవర్ హిట్టింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












