ఐసీసీ ప్రపంచకప్ గెలవడం ప్రతీ క్రికెటర్ కల. అందుకోసం ఆటగాళ్లు ఎంతో శ్రమిస్తారు. జట్టును విశ్వ విజేతగా నిలిపేందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డుంకులు ఎదురైనా లక్ష్యం వైపే దూసుకెళ్తారు. కానీ మెగా టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చి కీలక ఫైనల్కు ముందు గాయపడి జట్టుకు దూరమైతే సదరు ఆటగాడికి కలిగే బాధ వర్ణనాతీతం.
తాను దూరమైనా తమ జట్టు విశ్వవిజేతగా నిలిచి తనకు ఆ మెడల్ దక్కకపోతే అంతకుమించిన నరకయాతన మరొకటి ఉండదు. ఇలాంటి పరిస్థితినే భారత మహిళల జట్టు ఓపెనర్ ప్రతీకా రావల్ ఎదుర్కొంది.
ఈ టోర్నీలో ప్రతీకా రావల్ 6 ఇన్నింగ్స్ల్లో 308 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ తరఫున సెకండ్ హయ్యెస్ట్ బ్యాటర్గా నిలిచింది. దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్తో చివరి లీగ్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ చీలమండ గాయానికి గురైంది. దాంతో ఆమె జట్టుకు దూరమైంది. ప్రతీకా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ సెమీఫైనల్లో నిరాశపర్చినా.. ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ను గెలిపించింది. దాంతో ఫైనల్లో గెలిపించేందుకే షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చిందా? అనే చర్చ జరిగింది.

జట్టులో లేకపోయినా.. భారత జట్టు విజయ సంబరాల్లో ప్రతీకా రావల్ భాగమైంది. వీల్ఛైర్ సాయంతో మైదానంలోకి వచ్చిన ప్రతీకా రావల్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్వయంగా స్టేజిపైకి తీసుకెళ్లింది. అయితే అందరికి మెడల్స్ దక్కగా.. ప్రతీకా రావల్కు మాత్రం ప్రపంచకప్ విన్నింగ్ మెడల్ ఇవ్వలేదు. ఐసీసీ రూల్స్ ప్రకారం 15 మంది ఆటగాళ్లకే ఈ మెడల్ ఇస్తారు. దాంతో ప్రతీకా రావల్ మెడల్ లేకుండా ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది. పైకి సంతోషంగా కనిపించినా మెడల్ దక్కలేదనే బాధ ఆమెను వెంటాడింది. సహచర ఆటగాళ్లు ఇదే విషయాన్ని చెప్పారు. ఆమె కూడా ఈ విజయంలో భాగమని స్పష్టం చేశారు.
మరోవైపు సోషల్ మీడియా వేదికగా ప్రతీకా రావల్పై సానుభూతి వ్యక్తమైంది. పాపం ప్రతీకా రావల్ ప్రపంచకప్లో సత్తా చాటిన మెడల్ దక్కలేదని ఫ్యాన్స్ నిట్టూర్చారు. బీసీసీఐ స్పెషల్ రిక్వెస్టో లేక.. ఐసీసీనే ఇచ్చిందో తెలియదు కానీ ప్రతీకా రావల్కు ప్రపంచకప్ విన్నింగ్ మెడల్ దక్కింది.
బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో ప్రతీకా రావల్ మెడలో ప్రపంచకప్ విన్నింగ్ మెడల్ కనిపించింది. ఈ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ట్రోఫీతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫొటోలో ప్రతీకా రావల్ మెడలో విన్నింగ్ మెడల్ మెరిసింది. దాంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మొత్తానికి ఆమె కష్టానికి ఫలితం లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.