భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్కు ప్రేక్షకాదరణ కరువైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్టేడియం మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకాదరణ లభించే స్టేడియాల్లో టెస్ట్ మ్యాచ్లు నిర్వహించాలని మండిపడుతున్నారు. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది.
వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ ఇన్నింగ్స్ రెండు సెషన్లలోనే ముగిసింది.

అయితే ఈ మ్యాచ్కు ప్రేక్షకులు హాజరు కాకపోవడంతో వేదికల ఎంపికపై సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు దారి తీసింది. 'ఒక దిగువ స్థాయి జట్టుతో ఆడాల్సి వచ్చినప్పుడు టెస్ట్ క్రికెట్ను చూడటానికి ఇష్టపడే స్టేడియాన్ని వేదికగా ఎంచుకోవాలి. నిర్ధిష్ట టెస్ట్ వేదికలు ఉండాలనే విరాట్ కోహ్లీ సూచనను పరిగణలోకి తీసుకోవాలి. అహ్మదాబాద్ మైదానం దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. అంత పెద్ద మైదానంలో దిగువ స్థాయి జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఖాళీగా కనిపిస్తుంది. అహ్మదాబాద్ టీ20 మార్క్యూ మ్యాచ్లకు మంచి వేదిక. టెస్ట్లకు ఏ మాత్రం కాదు.
ప్రధాన జట్టుతో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడినా.. స్టేడియం ఖాళీగానే కనిపిస్తోంది. టూరిజం, కనెక్టివిటీ ఉన్న నగరాలను టెస్ట్ వేదికలుగా ఎంచుకోవాలి. చెన్నై, కోల్కతా, బెంగళూరు, ముంబై, పూణే, నాగ్పూర్, ఢిల్లీ, ధర్మశాల, వైజాగ్ వంటి స్టేడియాలను టెస్ట్ మ్యాచ్లకు పరిగణలోకి తీసుకోవాలి.'అని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్కు మెజార్టీ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
బీసీసీఐ రొటేషన్ పాలసీలను 18 వేదికలను టెస్ట్ల కోసం ఉపయోగిస్తుంది. అయితే సుదీర్ఘ ఫార్మాట్ కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం చేయాలనే వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో విరాట్ కోహ్లీ టెస్ట్లను కొన్ని వేదికలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పాడు. రొటేషన్ పాలసీ టీ20, వన్డే ఫార్మాట్లకు బాగుటుందని, టెస్ట్ మ్యాచ్లను ఐదు వేదికలకే పరిమితం చేయాలని సూచించాడు. దసరా పండుగ రోజున మ్యాచ్ను షెడ్యూల్ చేయడం కూడా తెలివి తక్కువ పనని, మ్యాచ్కు ప్రేక్షకులు హాజరు కాకపోవడానికి ఇది ఒక కారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బ్రాడ్ కాస్టర్స్ ఒత్తిడితో పండుగ రోజు ఈ మ్యాచ్ షెడ్యూల్ చేసినట్లు అర్థమవుతుంది.