ఎమర్జింగ్ ఆసియాకప్ 2024లో భారత్-ఏ శుభారంభం చేసింది. దాయాదీ పాకిస్థాన్-ఏతో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించిన యంగ్ ఇండియా.. చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 44), ప్రభ్సిమ్రాన్ సింగ్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 36), అభిషేక్ శర్మ(22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 35) రాణించారు. పాకిస్థాన్ -ఏ బౌలర్లలో మహమ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, అరఫత్ మిన్హాస్, కాసిమ్ అక్రమ్ తలో వికెట్ తీయగా.. సుఫియన్ ముఖీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి ఓటమిపాలైంది. అరఫత్ మిన్హాస్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 41), యాసిర్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/33) మూడు వికెట్లు తీయగా.. రసిక్ సలామ్(2/30), నిషాంత్ సింధు(2/15) రెండేసి వికెట్లు తీసారు.
టీమిండియా ప్లేయర్ రమణ్దీప్ సింగ్ పట్టిన స్టన్నింగ్ డైవ్ క్యాచ్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. నిషాంత్ సింధు వేసిన 9వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని పాకిస్థాన్ ఓపెనర్ యాసిర్ ఖాన్ భారీ షాట్ ఆడగా..బౌండరీ లైన్ వద్ద రమణ్దీప్ సింగ్ ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి స్టన్నింగ్ డైవ్తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ను చూసి అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ క్యాచ్ పాకిస్థాన్ ఓటమికి బాటలు వేసింది. ఈ క్యాచ్ పట్టకుంటే యాసిర్ ఖాన్ భారీ ఇన్నింగ్స్ ఆడేవాడు.