ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలవడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులారా.. ఈ సారి టైటిల్ సాధించాం(ఈ సాలా కప్ నమ్దూ) అని గట్టిగా చెప్పాడు. 18 ఏళ్లుగా జట్టుకు అండగా నిలిచిన అభిమానులతో పాటు తనకు, విరాట్ కోహ్లీకి ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ.. తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రజత్ పటీదార్.. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు రాణించడంతోనే టైటిల్ అందుకున్నామని చెప్పాడు.

'నాతో పాటు విరాట్ కోహ్లీ, 18 ఏళ్లుగా జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులందరికీ ఈ విజయం చాలా ప్రత్యేకమైనది. ఈ విజయానికి అభిమానులు పూర్తి అర్హులు. క్వాలిఫయర్-1 గెలవగాలనే టైటిల్ సాధిస్తామనే నమ్మకం కలిగింది. ఈ వికెట్పై 190 పరుగుల మంచి స్కోర్ అని నేను ముందే అనుకున్నాను. ఎందుకంటే వికెట్ చాలా స్లోగా ఉంది. మా బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేసి ఫలితం రాబట్టారు. కృనాల్ మా వికెట్ టేకర్. నాకు ఒత్తిడి కలిగినప్పుడల్లా నేను కృనాల్కు బంతిని అందిస్తా.
సుయాష్ శర్మ కూడా ఈ సీజన్లో అదరగొట్టాడు. అతనితో పేసర్లు భువనేశ్వర్ కుమార్ యాదవ్, యష్ దయాల్, జోష్ హజెల్ వుడ్, రొమారియో రాణించారు. రొమారియో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ 2-3 ఓవర్లు వేసి బ్రేక్ త్రూ అందించాడు. విరాట్ కోహ్లీ పర్యవేక్షణలో ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప అవకాశం. కెప్టెన్గా నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ విజయానికి కోహ్లీ పూర్తి అర్హుడు. విరాట్ కోహ్లీ, అభిమానులతో పాటు నాకు అండగా నిలిచిన మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్కు ధన్యవాదాలు. అభిమానులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 'ఈ సాలా కప్ నమ్దూ'.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.