టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా చిక్కుల్లో పడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో బుధవారం విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. '1xBet' అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్కు సురేష్ రైనా ప్రచారకర్తగా వ్యవహరించడంతోనే అతన్ని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. సురేశ్ రైనాపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుతో అతనికి ఉన్న సంబంధం, 1xBet యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం, అందుకు తాను తీసుకున్న డబ్బుల వివరాల గురించి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయాలు అక్రమంగా తరలిపోతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. సెలెబ్రిటీల ప్రచారకర్తలుగా ఉండటంతో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడటం ఎక్కువైందనే విషయాన్ని ఈడీ గుర్తించింది. ఈ యాప్ల ద్వారా వచ్చిన డబ్బును వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసి, హవాలా, క్రిప్టోకరెన్సీ సాయంతో విదేశాలకు తరలిస్తున్నట్లు ఈడీ తమ విచారణలో కనుగొంది. చట్టవిరుద్దమైన ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా అమాయక ప్రజలు కోట్ల రూపాయాలు కోల్పోతున్నారని, అంతేకాకుండా ఈ సంస్థలు ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు తమ విచారణలో ఈడీ గుర్తించింది.

ఇక ఆన్లైన్ బెట్టింగ్పై దేశవ్యాప్తంగా విచారణ సాగుతోంది. ఇప్పటికే రణ్బీర్ కపూర్, కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లతో పాటు పలువురు సెలెబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. తెలంగాణ పోలీసులు ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండతో పాటు 25 మంది టాలీవుడ్ సెలెబ్రిటీలకు సమన్లు జారీ చేసి విచారించారు. క్రికెటర్లలో సురేష్ రైనాతో పాటు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సోను సూద్లను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన ప్రకటనలను అనుమతించినందుకు ఫేస్బుక్(మెటా), గూగుల్ సంస్థలకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.