హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో మరోసారి భారీ అవినీతి వెలుగు చూసింది. హెచ్సీఏలో భారీ మొత్తంలో నిధులు గోల్మాల్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో తేలింది. క్రికెట్ బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ ఇక్విప్మెంట్ కొనుగోలు వ్యవహారంలో గత హెచ్సీఏ పాలకవర్గ సభ్యులు చేసిన భారీ అవినీతి బయట పడింది. గత హెచ్సీఏ ఆఫిస్ బేరర్స్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఈడీ గుర్తించింది.
20 కోట్ల నిధుల దుర్వినియోగంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. మార్కెట్ ధరకు మించి పలు కంపెనీలకు కాంట్రాక్ట్ కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని ఈడీ విచారణలో తేలింది. ఈ అవినీతి దందాలో హెచ్సీఏ మాజీ ఉపాధ్యక్షుడు, కోశాధికారి సురేందర్ అగర్వాల్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

క్రిడ్ ప్రోకో.. 90 లక్షలు గోల్ మాల్
క్విడ్ప్రొకో జరిగిన ఇందులో మొత్తం 90 లక్షల అవినీతి జరిగినట్లు గుర్తించిన ఈడీ.. రూ.51.29 లక్షల ఆస్తులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ)కింద జప్తు చేసినట్లు పేర్కొంది. మొత్తంగా లక్షలు రూపాయలు చేతులు మారిన ఈ అవినీతి దందాలో ఈడీ పలు సంచలనాల విషయాలను బయటపెట్టింది. స్టేడియం కోసం బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ పరికరాల కోసం సారా స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్, బాడీ డ్రెంచ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు హెచ్సీఏ కాంట్రాక్టులు అప్పగించింది.
అయితే మార్కెట్ ధరకు మించి అధిక మొత్తానికి కోట్ చేసిన ఈ కంపెనీలు క్విడ్ప్రొకో కింద సురేందర్ అగర్వాల్కు భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పినట్లు ఈడీ విచారణలో స్పష్టమైంది. ఇందులో సురేందర్ అగర్వాల్ కుటుంబానికి రూ.90.86 లక్షల లబ్ధి చేకూరినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
కుటుంబ సభ్యులకు డబ్బులు..
సురేందర్ భార్యకు చెందిన కేబీ జువెల్లర్స్కు సారా స్పోర్ట్స్ రూ. 17 లక్షలు ఇవ్వగా.. కొడుకు అక్షిత్ అగర్వాల్కు మ్యూజిక్ షో, ఈవెంట్ మేనేజ్మెంట్ కింద భారీ మొత్తంలో డబ్బులు అందాయి. బకెట్ కుర్చీల కొనుగోలు కింద ఎక్సలెంట్ ఎంటర్ప్రైజెస్.. అక్షిత్ అగర్వాల్ అకౌంట్తో పాటు వజ్రాలు కొన్నందుకు కేబీ జువెల్లర్స్కు రూ.21.86 లక్షలు అందజేశాయి. అంతటితో ఆగకుండా సురేందర్తో పాటు అతని కోడలు వ్యక్తిగత అకౌంట్లకు తోడు కేబీ జువెల్లర్స్కు జిమ్ పరికరాల సరఫరా కంపెనీ బాడీ డ్రెంచ్ ఇండియా రూ.52 లక్షలు ఇచ్చినట్లు విచారణలో తేటతెల్లమైంది.
సురేందర్ అగర్వాల్తో పాటు ఈ కేసుల్లో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్పై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే మహమ్మద్ అజారుద్దీన్ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.