హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ. 20 కోట్ల మేర అవకతవకలు జరగాయనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు, కార్యదర్శులను ఈడీ విచారించింది.
మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్లను 2 రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వినోద్కు నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. స్టేడియం మరమ్మతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి నిధులు గోల్ మాల్ చేశారని ఏసీబీ ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసింది.

ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసును ఈడీ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో నవంబర్లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు, డిజిటల్ పరికారాలు, రూ. 10.39 లక్షలను స్వాధీనం చేసుకుంది.
వినోద్ సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి సంస్థల్లో హెసీఏ సొమ్మును ఖర్చు చేసినట్లు ఈడీ గుర్తించింది.
ఆఫీస్ బేరర్లు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై.. అధిక మార్కెట్ ధరలకు కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించారని ఈడీ ఆరోపిస్తోంది.