
లండన్: కరోనా కారణంగా రద్దయిన భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టును రీషెడ్యూల్ చేశారు. వచ్చే ఏడాది జులై 1 నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం ప్రకటించింది. మ్యాచ్ వేదికను మాంచెస్టర్ నుంచి ఎడ్జ్బాస్టన్కు మార్చినట్టు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వచ్చే ఏడాది టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పింది.
ఈ ఏడాది సెప్టెంబరులో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. భారత శిబిరంలో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో ఇరు బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చి ఐదో టెస్టును తాత్కాలికంగా రద్దు చేశాయి. అనంతరం ఈ మ్యాచ్ అంశంపై బీసీసీఐ, ఈసీబీ విస్తృతంగా చర్చలు జరిపి.. సిరీస్లో విజేతను తేల్చేందుకు ఐదో టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించాయి.
ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో నాలుగు మ్యాచ్లు పూర్తయ్యాక భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం టీమిండియా వచ్చే జులైలో ఇంగ్లండ్ టూర్కు వెళ్లనుంది. అయితే, టెస్ట్ మ్యాచ్ను రీషెడ్యూల్ చేసిన కారణంగా.. టీ20 సిరీస్ ఒరిజినల్ షెడ్యూల్ కంటే ఆరు రోజులు ఆలస్యంగా మొదలవనుంది. జూలై 7,9,10వ తేదీల్లో మూడు టీ20లు, అదే నెల 12,14,17వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయని ఈసీబీ చెప్పింది.
ఈ మ్యాచ్ రద్దు చేసిన సమయంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ మ్యాచ్ జరగదని, భారత్ సిరీస్ గెలిచినట్లేనని, ఐపీఎల్ కోసమే మ్యాచ్ను రద్దు చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. టెస్ట్ మ్యాచ్ రద్దు చేసుకున్నారన్న కోసంతోనే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్కు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ, ఈసీబీ పరస్పర అంగీకారంతోనే మ్యాచ్ను రద్దు చేశాయనే విషయం తాజాగా స్పష్టమైంది.