చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్కు ముంబై ఇండియన్స్ మాత్రం రావద్దని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో అన్నాడు. తాను ఇలా ఎందుకు అంటున్నానో తన ఫ్రెండ్ కీరన్ పోలార్డ్కు తెలుసరి సరదాగా చెప్పుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1లో 15 పరుగులతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకున్న విషయం తెలిసిందే.
మరో బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించిన ముంబై రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే ఫైనల్ చేరనుంది.

అయితే ముంబై ఇండియన్స్ ఫైనల్ రావద్దని సీఎస్కే అభిమాననులు కోరుకుంటున్నారు. ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో ముంబైకే మెరుగైన రికార్డు ఉండటంతో ఆ జట్టు ఓడిపోవాలని కోరుకుంటున్నారు.
ఐపీఎల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు నాలుగు సార్లు తలపడగా.. ముంబై ఇండియన్సే మూడు సార్లు గెలిచింది. చెన్నై మాత్రం ఒక్కసారే విజయాన్నందుకుంది. అది కూడా అప్పుడెప్పుడో 2010లో తొలి సారి టైటిల్ అందుకున్నప్పుడు. ఆ తర్వాత 2013, 2015 , 2019 ఫైనల్స్లో ఇరు జట్లు తలపడగా.. ముంబై ఇండియన్సే ఛాంపియన్గా నిలిచింది.
ఈ రికార్డ్స్ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఫైనల్కు రావద్దని సీఎస్కే ఫ్యాన్స్, డ్వేన్ బ్రావో భావిస్తున్నారు. 'ముంబై ఇండియన్స్ మాత్రం ఫైనల్కు రావద్దు. నిజాయితీగా చెబుతున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఫైనల్లో ముంబై ఇండియన్స్తో తలపడటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. కారణం ఏంటో నా స్నేహితుడు కీరన్ పొలార్డ్కు తెలుసు. జోక్స్ పక్కనపెడితే అన్ని జట్లకు ఆల్ది బెస్ట్. ఎవరూ ఫైనల్కు వచ్చినా మేం ధీటుగా ఎదుర్కొంటాం. ఆ సత్తా మాకు ఉంది.'అని బ్రావో చెప్పుకొచ్చాడు.