బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా సౌత్ జోన్, వెస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. సౌత్ జోన్ విధించిన 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 62.3 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసింది.
ఆ జట్టు విజయానికి ఇంకా 116 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయితే క్రీజులో ఓపెనర్ ప్రియాంక్ పాంచల్(205 బంతుల్లో 11 ఫోర్లతో 92 బ్యాటింగ్) ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే మరో ఎండ్లో టెయిలెండర్స్ మాత్రమే ఉన్నారు.

స్టార్ బ్యాటర్లు పృథ్వీ షా(7), చతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్(4) దారుణంగా విఫలమయ్యారు. సర్ఫరాజ్ ఖాన్(48) సాయంతో ప్రియాంక్ పాంచల్ పోరాడాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో ఉన్నాడు. చివరి రోజు ఆటలో సౌత్ జోన్ ఐదు వికెట్లు తీస్తే దులీప్ ట్రోఫీ ఛాంపియన్గా నిలవనుంది.
సౌత్ జోన్ బౌలర్లలో వాసుకి కౌషిక్ మూడు వికెట్లు తీయగా.. విజయ్ కుమార్ వైశాఖ్, సాయి కిషోర్ తలో వికెట్ తీసారు. అంతకుముందు 181/7 ఓవర్ నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 230 పరుగులకు కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్(37), విజయ్ కుమార్ వైశాఖ్(23) విలువైన పరుగులు చేశారు.
వెస్ట్ జోన్ బౌలర్లలో ధర్మెంద్ర సిన్హ జడేజా(5/40) ఐదు వికెట్లతో సౌత్ జోన్ పతనాన్ని శాసించాడు. అతిత్ షేత్, అర్జన్ నగ్వస్వల్లా రెండేసి వికెట్లు తీయగా.. చింతన్ గజా ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ 67 పరుగుల ఆధిక్యం కలుపుకొని వెస్ట్ జోన్ ముందు 298 పరుగుల లక్ష్యం నమోదైంది.
ఇక తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 213 పరుగులు చేయగా.. వెస్ట్ జోన్ 146 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.
సంక్షిప్త స్కోర్లు..
సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 213 ఆలౌట్( హనుమ విహారి 63, తిలక్ వర్మ 40, షామ్స్ ములానీ3/29)
వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 146 ఆలౌట్(పృథ్వీ షా 65, విద్వత్ కావేరప్ప 7/53)
సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్: 230 ఆలౌట్(హనుమ విహారి 42, వాషింగ్టన్ సుందర్ 37, రికీ భూయ్ 37, జడేజా 5/40)
వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్: 182/5( ప్రియాంక్ పాంచల్ 92 బ్యాటింగ్, సర్ఫరాజ్ ఖాన్ 48)