బెంగళూరు: టీమిండియా వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా(278 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 133) శతక్కొట్టాడు. భారత సెలెక్టర్ల గూబ గుయ్ అనిపించేలా పరుగుల మోత మోగించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమైన పుజారాపై సెలెక్టర్లు వేటు వేసిన విషయం తెలిసిందే. పుజారాతో పాటు ఇతర బ్యాటర్లు విఫలమైనా.. అతనొక్కడినే బాధ్యుడ్ని చేస్తూ వెస్టిండీస్ పర్యటనలోని టెస్ట్ సిరీస్కు ఎంపిక చేయలేదు.
పుజారాపై వేటు వేయడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. డబ్ల్యూటీసీ వైఫల్యానికి పుజారా ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అభిప్రాయపడ్డాడు. సెలెక్టర్ల నిర్ణయంతో తీవ్ర ఆవేదనకు గురైన పుజారా ఆటను మెరుగు పరుచుకునేందుకు ముమ్మరంగా సాధన చేశాడు.

సొంతమైదానంలో గంటల కొద్ది ప్రాక్టీస్ చేసిన పుజారా.. మళ్లీ దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి సెంచరీతో సత్తా చాటాడు. దులిప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
పుజారాకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(58 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించగా.. ప్రస్తుతం వెస్ట్ జోన్ ఆధిక్యం 384 పరుగులకు చేరుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో వెస్ట్ జోన్ 220 పరుగులుచేయగా.. సెంట్రల్ జోన్ 128 పరుగులకే కుప్పకూలింది.
ఈ శతకంతో పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన నాలుగో భారత ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ 81 సెంచరీలతో టాప్లో ఉండగా.. రాహుల్ ద్రవిడ్ 68 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా సెంచరీలతో 60 సెంచరీలు పూర్తి చేసుకున్న పుజారా.. విజయ్ హజారే(60) సరసన నిలిచాడు.