ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాద్ స్టార్ తిలక్ శర్మ శతకం సాధించాడు. ఈ టోర్నీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా-ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. ఇండియా డీతో జరుగుతున్న మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన తిలక్ వర్మ.. రెండో మ్యాచ్కు స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీతో అవకాశాన్ని అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 10 పరుగులతో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్లో సత్తా చాటాడు. 96 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన తిలక్ వర్మ.. మరో 81 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. తిలక్ వర్మకు ఇది ఐదో ఫస్ట్ క్లాస్ సెంచరీ.

అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సెంచరీ బాదిన ఈ తెలుగు తేజం.. తెలుగు రాష్ట్రాల అభిమానులను సంతోషపరిచాడు. తిలక్ వర్మతో పాటు ఓపెనర్ ప్రథమ్ సింగ్(122)కూడా శతకం సాధించడంతో ఇండియా-ఏ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 96 ఓవర్లు ముగిసే సరికి ఇండియా-ఏ 3 వికెట్లకు 370 పరుగులు చేసింది. తిలక్ వర్మతో(104 బ్యాటింగ్) పాటు శశ్వాత్ రావత్(61 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
115/1 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇండియా-ఏ ప్రస్తుతం 477 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైంది. షామ్స్ ములాని(89), తనూష్ కొటియాన్(53)లు హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా(4/51) నాలుగు వికెట్లు తీయగా.. కావేరప్ప, అర్ష్దీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఇండియా-డీ 183 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(124 బంతుల్లో 15 ఫోర్లతో 92) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(3/39), ఆఖిబ్ ఖాన్(3/41) మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, తనూష్ కోటియన్, షామ్స్ ములాని తలో వికెట్ తీసారు. దాంతో ఇండియా-ఏకు 107 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అద్భుతం జరిగితే తప్పా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఇండియా-డీ ఈ మ్యాచ్ను గెలవలేదు.