రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2021లో ఇండియా బీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. ఇండియా-ఏతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్లో 10 బంతుల్లో 7 పరుగులే చేసి శుభ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన రిషభ్ పంత్.. ఆకాశ్ దీప్ బౌలింగ్లో నిర్లక్ష్య షాట్తో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అతని ఫ్లిక్ షాట్ మిస్టైమ్ అవ్వగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. శుభ్మన్ గిల్ వెనక్కి పరుగెత్తి సూపర్ డైవ్తో క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ ఎఫర్ట్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. వారెవ్వా వాటే క్యాచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఫీల్డర్ లేని ప్రదేశంలో ఆడాలనుకున్న రిషభ్ పంత్.. శుభ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో బిత్తరపోయాడు. ఘోర రోడ్డు ప్రమాదానికి ముందు బంగ్లాదేశ్తో మిర్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో చివరిసారిగా రెడ్ బాల్ క్రికెట్ ఆడిన పంత్.. ఆ మ్యాచ్లో 93, 9 పరుగులు చేశాడు.
మళ్లీ బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్ల సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని పంత్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సూచనల మేరకు దులీప్ ట్రోఫీ 2024 బరిలో నిలిచాడు. కానీ తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా బీ జట్టు 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ నుంచి లభించిన సహకారంతో ఇండియా-ఏ పేసర్లు నిప్పులు చెరగగా.. ఇండియా బీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(59 బంతుల్లో 30), అభిమన్యు ఈశ్వర్(42 బంతుల్లో 13) కాస్త ఓపికగా బ్యాటింగ్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్(9), రిషభ్ పంత్(7), నితీష్ కుమార్ రెడ్డి(0), వాష్టింగన్ సుందర్(0), సాయి కిషోర్(1) దారుణంగా విఫలమయ్యారు.
ముషీర్ ఖాన్(129 బంతుల్లో 54 బ్యాటింగ్).. నవ్దీప్ సైనీతో( 26 బంతుల్లో 7 బ్యాటింగ్) కలిసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీసారు.