ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 తొలి మ్యాచ్లో హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మకు అవకాశం దక్కలేదు. శుభ్మన్ గిల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టులో భాగంగా ఉన్న తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-బీ జట్టుతో గురువారం ప్రారంభమైన తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా-ఏ బౌలింగ్ ఎంచుకుంది.
వర్ష ప్రభావం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇండియా-ఏ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. 'బౌలర్లకు పిచ్ సహకరించే అవకాశం ఉంది. శశాంక్ సేవలను మేం కోల్పోయాం. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ ఆడుతున్నారు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నాం. ఈ మ్యాచ్ గెలవడమే మా లక్ష్యం. ఈ విజయంలో అందరం భాగస్వామం కావాలనుకుంటున్నాం.'అని టాస్ సందర్భంగా శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ సామర్థ్యం కలిగిన రియాన్ పరాగ్, శివమ్ దూబేల కోసం తిలక్ వర్మను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. టాపార్డర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేయగా.. మిడిలార్డర్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, శివమ్ దూబేలను తీసుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్ అవకాశం అందుకోగా.. పేసర్లుగా ఆకాశ్ దీప్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లను ఎంపిక చేశారు.
పిచ్ కండిషన్స్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో ఎక్స్ట్రా బౌలర్తో ఇండియా-ఏ బరిలోకి దిగింది. దాంతో తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఫస్ట్ రౌండ్ మ్యాచ్ల ప్రదర్శనలను బట్టి భారత పురుషుల సెలెక్షన్ కమిటీ.. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడే భారత జట్టును ఎంపికచేయనుంది. దాంతో ఈ టోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తొలి మ్యాచ్లో చోటు దక్కించుకోలేకపోయిన తిలక్ వర్మ.. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. రియాన్ పరాగ్ కోసం తిలక్ వర్మను బలి చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇండియా బీ జట్టులో ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నాడు.
సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి దులీప్ ట్రోఫీ 2024ని బీసీసీఐ నిర్వహిస్తోంది. ప్రతీ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీలో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జోన్స్ జట్లు తలపడుతాయి. కానీ ఈసారి భారత అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఏ,బీ,సీ, డీ జట్లను భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడనుండటంతో రెడ్ బాల్ క్రికెట్కు కుర్రాళ్లను సంసిద్దం చేయాలనే లక్ష్యంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
తుది జట్లు:
ఇండియా బీ తుది జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), ముషీర్ ఖాన్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్
ఇండియా ఎ: శుభ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (కీపర్), శివమ్ దూబే, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్