ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో తెలుగు తేజం, సన్రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమయ్యాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా-బీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నితీష్ కుమార్.. ఇండియా సీతో జరుగుతున్న మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
ఇండియా సీ ఆల్రౌండర్ అన్షూల్ కంబోజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎన్నో అంచనాలతో ఈ టోర్నీ బరిలోకి దిగిన నితీష్ కుమార్ రెడ్డి.. ఊహించని రీతిలో విఫలమయ్యాడు.

దాంతో బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యే అవకాశాలను చేజార్చుకున్నాడు. తొలి మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో రాణించి ఉంటే బంగ్లాతో సిరీస్కు ఎంపికయ్యేవాడు. టెస్ట్ ఫార్మాట్ ఆల్రౌండర్ కోసం టీమిండియా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. ఆ స్థానాన్ని నితీష్ కుమార్ రెడ్డితో భర్తీ చేయాలనే అతన్ని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసింది. కానీ అతను తీవ్రంగా నిరాశపరిచాడు.
మరోవైపు సీనియర్ ఆటగాళ్లకు రిప్లేస్మెంట్గా జట్టులోకి వచ్చిన రింకూ సింగ్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. 16 బంతుల్లో 6 పరుగులే చేసి అన్షూల్ కంబోజ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రింకూ సింగ్ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ఫార్మాట్లో తిరుగులేని ఆటతో ఆకట్టుకుంటున్న రింకూ సింగ్.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం రాణించలేకపోతున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా సీ తొలి ఇన్నింగ్స్లో 124.1 ఓవర్లలో 525 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్(126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 111) సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58), మనవ్ సుతార్(82) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇండియా బీ బౌలర్లలో ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్ నాలుగేసి వికెట్లు తీయగా.. నవ్దీప్ సైనీ, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇండియా బీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్లకు 309 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్(262 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్తో 143 బ్యాటింగ్) అజేయ శతకంతో రాణించగా.. నారయణ్ జగదీషన్(137 బంతుల్లో 8 ఫోర్లతో 70) హాఫ్ సెంచరీతో రాణించారు. ఇండియా సీ బౌలర్లలో అన్షుల్ కంబోజ్(5/66) ఐద వికెట్లతో సత్తా చాటగా.. విజయ్కుమార్ వైశాఖ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.