టీమిండియా అప్కమింగ్ స్టార్, కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) యంగ్ సెన్సేషన్ హర్షిత్ రాణా.. మళ్లీ ఫ్లయింగ్ కిస్ సెలెబ్రేషన్స్తో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్లో ఈ ముద్దుల సంబరాలతో ఓ మ్యాచ్ నిషేధంతో పాటు జరిమానా ఎదుర్కొన్న ఈ యువ పేసర్.. మళ్లీ అదే తరహా సెలెబ్రేషన్స్తో ప్రత్యర్థి బ్యాటర్ను కవ్వించాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఇండియా-డీకి ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్ రాణా.. అనంతపురం వేదికగా ఇండియా సీతో గురువారం ప్రారంభమైన తొలి మ్యాచ్లో(2/13) రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇండియా సీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5)ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన హర్షిత్ రాణా.. అతనికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ రెచ్చగొట్టాడు.

ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలి..?
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అనంతరం మరో ఓపెనర్ సాయి సుదర్శన్(7)ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్ తీసుకున్న అనంతరం కూడా గాల్లోకి పంచ్లు ఇస్తూ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. అయితే హర్షిత్ రాణా బౌలింగ్ ప్రద్శనను మెచ్చుకుంటున్న నెటిజన్లు.. అతని ప్రవర్తనను మాత్రం తప్పుబడుతున్నారు.
టీమిండియా తరఫున ఆడాలంటే ఈ ప్రవర్తనను మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఔటైనప్పుడు వారిని కవ్వించడం మంచిది కాదని సూచిస్తున్నారు. కొందరైతే ఐపీఎల్ 2024 సీజన్ ఘటనలను గుర్తు చేస్తూ.. 'హర్షిత్ రాణా.. మళ్లీ ఏంది ఈ ముద్దుల గోల'అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలని ఘాటుగా చెబుతున్నారు.
మయాంక్ అగర్వాల్తో మొదలు..
ఐపీఎల్ 2024 సీజన్లో హర్షిత్ రాణా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసి అతని ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. హర్షిత్ రాణా రియాక్షన్కు అవాక్కైన మయాంక్ అగర్వాల్ నిశబ్ధంగా క్రీజును వీడాడు. ఈ చర్యను తప్పుబట్టిన ఐపీఎల్ నిర్వాహకులు మందలింపుతో పాటు మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ జరిమానా విధించారు.
అయినా మారని హర్షిత్ రాణా.. మరో మ్యాచ్లో ప్రత్యర్థి టీమ్ డగౌట్ వైపు ఫ్లయింగ్ కిస్లు ఇచ్చాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ నిర్వాహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం కూడా విధించారు. ఐపీఎల్ 2024 సీజన్లో 13 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన రాణా.. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.
అదరగొట్టిన అక్షర్ పటేల్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా డీ.. అక్షర్ పటేల్(83) అసాధారణ పోరాటంతో తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకు కుప్పకూలింది.
అథర్వ టైడ్(4), యశ్ దుబే(10), శ్రేయస్ అయ్యర్(9), దేవదత్ పడిక్కల్(0), రికీ భుయ్(4), శ్రీకర్ భరత్(13), సరన్ష్ జైన్(13), హర్షిత్ రాణా(0), అర్ష్దీప్ సింగ్(13) దారుణంగా విఫలమయ్యారు.
ఇండియా సీ బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్(3/19) మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(2/47), హిమన్షఉ చౌహన్(2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ తలో వికెట్ తీసారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సీ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 4 వికెట్లకు 91 పరుగులు చేసింది. క్రీజులో బాబా ఇంద్రజీత్(15 బ్యాటింగ్), అభిషేక్ పోరెల్( 32 బ్యాటింగ్) ఉన్నారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.