ముంబై ఇండియన్స్ యువ ఆల్రౌండర్, హర్యానా క్రికెటర్ అన్షుల్ కంబోజ్ నిప్పులు చెరిగాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అన్షుల్ కంబోజ్.. ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. బ్యాటింగ్లో 38 పరుగులే చేసినా.. బౌలింగ్లో మాత్రం నిప్పులు చెరిగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే తొలి సారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
బౌలింగ్కు ఏమాత్రం అనుకూలం లేని ఫ్లాట్ వికెట్పై తొలి ఇన్నింగ్స్లో ఐదు కీలక వికెట్లు తీసాడు. ఇండియా బీ ప్రధాన బ్యాటర్లు నారయణ జగదీషన్(70), సెంచరీ హీరో ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్(16), రింకూ సింగ్(6), తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(2)లను పెవిలియన్ చేర్చాడు. నితీష్ కుమార్ రెడ్డిని క్లీన్ బౌల్డ్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఫ్లాట్ వికెట్పై కీలకమైన ఐదు వికెట్లు తీసిన అన్షుల్ కంబోజ్పై నెటిజన్లు, క్రికెట్ ఎక్స్పర్ట్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇండియా సీలోని ఇతర బౌలర్ల నుంచి సహకారం లేకపోయినా.. ఒక్కడే ఐదు వికెట్లు తీసి ఇండియా-బీ పతనాన్ని శాసించాడు. అన్షుల్ కంబోజ్ ధాటికి ఇండియా-బీ 194 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇండియా బీ 90 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(135 బ్యాటింగ్) సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి తోడుగా సాయి కిషోర్(18 బ్యాటింగ్) ఉన్నాడు.
ముంబై ఇండియన్స్కు చెందిన అన్షుల్ కంబోజ్.. ఐపీఎల్ 2024 సీజన్లో 3 మ్యాచ్లు ఆడి 2 పరుగులతో పాటు 3 వికెట్లు తీసాడు. తాజా ఐదు వికెట్ల ప్రదర్శన నేపథ్యంలో ముంబై స్కౌట్స్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా సీ తొలి ఇన్నింగ్స్లో 124.1 ఓవర్లలో 525 పరుగులకు కుప్పకూలింది. ఇషాన్ కిషన్(126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 111) సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58), మనవ్ సుతార్(82) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇండియా బీ బౌలర్లలో ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్ నాలుగేసి వికెట్లు తీయగా.. నవ్దీప్ సైనీ, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ పడగొట్టారు.