బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్జోన్, సౌత్జోన్ మధ్య జరుగుతన్న సెమీఫైనల్ హోరా హోరీగా సాగుతోంది. బౌలర్ల హవా సాగిన తొలి రోజు బ్యాటర్లు తడబడ్డారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ఇరు జట్ల బౌలర్లు అందిపుచ్చుకోవడంతో తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. సౌత్ జోన్ పేస్ బౌలర్ విద్వత్ కవేరప్ప (5/28) ధాటికి నార్త్జోన్ తొలి రోజు మొదటి ఇన్నింగ్స్లో 198 పరుగులకే ఆలౌటైంది.
ప్రభ్సిమ్రన్ సింగ్ (49), అంకిత్ కుమార్(33) టాప్ స్కోరర్గా నిలిచారు. సౌత్ జోన్ బౌలర్లలో విద్వత్తో పాటు శశికాంత్ రెండు వికెట్లు పడగొట్టాడు. విజయ్ కుమార్ వైశాఖ్, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్లకు తలో వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నార్త్ జోన్.. విద్వత్ ధాటికి 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ప్రభ్సిమ్రన్ సింగ్, అంకిత్ కుమార్ (33) నాలుగో వికెట్కు 79 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. కానీ సౌత్ జోన్ బౌలర్ల విజృంభణతో మళ్లీ చకచకా వికెట్లు కోల్పోయిన నార్త్ 123/7కు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో హర్షిత్ రాణా (31), వైభవ్ అరోరా (23 నాటౌట్) కాస్త రాణించడంతో ఆ జట్టు రెండొందలకు చేరువగా వెళ్లగలిగింది.
అనంతరం నార్త్ జోన్ కూడా బంతితో విజృంభించింది. బల్తేజ్ సింగ్ (2/21), హర్షిత్ రాణా (2/19) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 63 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సౌత్ జోన్ ఓ దశలో 35 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. కానీ మయాంక్ అగర్వాల్ (37 బ్యాటింగ్), తిలక్ వర్మ (12 బ్యాటింగ్) జట్టును ఆదుకున్నారు.
సౌత్జోన్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(9), రవికుమార్ సమర్థ్(1), కెప్టెన్ హనుమ విహారి(0), రికీ భూయ్(0) దారుణంగా విఫలమయ్యారు.
సంక్షిప్త స్కోర్లు:
నార్త్జోన్ తొలి ఇన్నింగ్స్: 198 ఆలౌట్ (ప్రభ్సిమ్రన్ సింగ్ 49, అంకిత్ కుమార్ 33, హర్షిత్ రాణా 31, నిశాంత్ నాయుడు 27, వైభవ్ అరోరా 23 నాటౌట్; విద్వత్ కవేరప్ప 5/28, శశికాంత్ 2/52)