భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్లో అంపైర్ల నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఫీల్డ్ అంపైర్లు భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఆటలో జోరూట్ ఎల్బీడబ్ల్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్ నాటౌటివ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహమ్మద్ సిరాజ్ వేసిన 38వ ఓవర్లో జోరూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో భారత్ రివ్యూ తీసుకోగా రిప్లేలో బంతి లెగ్ స్టంప్ను తాకింది. కానీ థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అంపైర్ కాల్స్ అని పేర్కొన్నాడు. అయితే ఈ నిర్ణయంపై భారత ఆటగాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కామెంటేటర్లు సైతం అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే అంపైర్ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇది ఔటేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంపైర్ జోరూట్ను రక్షించాడని సెటైర్లు పేల్చుతున్నారు.

2/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ను భారత బౌలర్లు దెబ్బతీసారు. మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లను సిరాజ్ పెవిలియన్ చేర్చితే జాక్ క్రాలీ(22)ని నితీష్ కుమార్ రెడ్డి ఔట్ చేశాడు. హ్యారీ బ్రూక్(23)ను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, జో రూట్ ఆచితూచి ఆడి తొలి సెషన్ను ముగించగా.. రెండో సెషన్ చివర్లో వాషింగ్టన్ సుందర్ జోరూట్(40)తో పాటు జెమీ స్మిత్(8)లను పెవిలియన్ చేర్చాడు. ఆఖరి సెషన్ ఆరంభంలోనే బ్రైడన్ కార్స్(1)ను బుమ్రా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 182 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది. దాంతో ఏ జట్టుకు ఆధిక్యం దక్కలేదు.