
నా కాన్ఫిడెన్స్ను పెంచింది..
'విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను ఔట్ చేయడం అద్భుతం. అతను అసాధారణమైన ఆటగాడు. నేను నేర్చుకున్నది మ్యాచ్లో చూపెట్టా. నా వయసు 23 ఏళ్లే. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంది. ఎత్తుపల్లాలు ఉంటాయి. కోహ్లీ వికెట్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మ్యాచ్ మధ్యలో వికెట్ల గురించి ఎక్కువగా ఆలోచించను. చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాం. సెకండ్ ఇన్నింగ్స్లోనూ కోహ్లీని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తా'అని బెస్ పేర్కొన్నాడు.

మ్యాజిక్ బాల్ కాదు..
సౌతాఫ్రికా, శ్రీలంక పర్యటనల్లో 5 వికెట్ల ఘనతను అందుకున్నా.. తాజా టెస్ట్ మ్యాచ్ ప్రదర్శనే తనకు అత్యుత్తమమని ఈ ఇంగ్లండ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. విరాట్ వికెట్ కోసం తాను ఎలాంటి మ్యాజికల్ బాల్ వేయలేదన్నాడు. గుడ్ ఏరియాలో 10,15 బాల్స్ వేయడం వల్లే విరాట్ వికెట్ దక్కిందని తెలిపాడు. భారీగా పరుగులిచ్చుకున్న తన సహచర ఆటగాడు జాక్ లీచ్ను బెస్ వెనుకేసుకొచ్చాడు. రిషభ్ పంత్ వంటి ఆసాధారణ ఆటగాడిని అడ్డుకోవడం కష్టమని, పరుగులిచ్చినంత మాత్రానా లీచ్ ఆత్మవిశ్వాసం ఏం తగ్గదన్నాడు. అతను నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు.

షార్ప్ బౌన్సర్..
దాదాపు 10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా విరాట్ కోహ్లీ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. ఫ్లాట్ వికెట్పై స్పిన్నర్ బెస్ అద్భతమైన టర్నింగ్ రాబట్టాడు. 25వ ఓవర్లో మంచి టర్న్, షార్ప్ బౌన్స్తో బేస్ వేసిన బాల్ను కోహ్లీ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్ కావడంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ లెగ్లో ఉన్న పోప్ చేతుల్లోకి వెళ్లింది.

కష్టాల్లో భారత్..
ఇంగ్లండ్ చేతిలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ తేలిపోతోంది. తొలి టెస్టులో భారత్ కష్టాల నావతో ఏటికి ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 74 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 321 పరుగుల దూరంలో ఉంది. చతేశ్వర్ పుజారా , రిషభ్ పంత్ (88 బంతుల్లో 91; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినా.. వారి ఆట ఒడ్డున పడేసేదాకా సాగలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బెస్ (4/55), పేసర్ ఆర్చర్ (2/52) భారత బ్యాటింగ్ను చెదరగొట్టాడు. ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ మిగిలున్న 4 వికెట్లతో 122 పరుగులు చేయాలి. వాషింగ్టన్ సుందర్ (33 బ్యాటింగ్), అశ్విన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.


Click it and Unblock the Notifications
