లండన్: భారత్ పర్యటన తర్వాత తనకు క్రికెట్పైనే విరక్తి కలిగిందని ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బెస్ అన్నాడు. అయితే ఈ పర్యటనలో కఠిన పరిస్థితుల మధ్య నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో తాను మంచి ప్రదర్శన చేయడానికి ఉపయోగపడ్తాయన్నాడు. ఈ ఏడాది శ్రీలంక, భారత్తో జరిగిన నాలుగు టెస్ట్ల్లో డామ్ బెస్ 17 వికెట్లతో సత్తా చాటాడు. కానీ నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు.
ఈ క్రమంలోనే భారత్తో జరిగిన టెస్ట్సిరీస్లో రెండు మ్యాచ్లు బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్పై 3-1 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడిన డామ్ బెస్ ఇండియా టూర్కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"భారత పర్యటన తర్వాత తగిన విరామం తీసుకున్నాను. ఎందుకంటే నేను నిజంగా క్రికెట్ను ద్వేషించడం మొదలుపెట్టాను. భారత్లోని బయోబబుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అందులో కేవలం క్రికెట్ గురించే చర్చ నడిచేది.
దాంతో మంచి ప్రదర్శన చేసినప్పుడు అంతా బాగానే ఉన్నా.. అలా జరగనప్పుడు పరిస్థితి కఠినంగా ఉండేది. ఆ ఒత్తిడి ఇంకా నాపై ఉంది. దాని నుంచి బయటపడటం నాకు ఎంతో అవసరం.'అని డామ్ బెస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కౌంటీల్లో బెస్ అదరగొడుతున్నాడు.