
హైదరాబాద్: ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కరణ్ జాక్ పాట్ కొట్టాడు. శుక్రవారం కొచ్చి వేదికగా జరిగిన ఈ 'కోట్లాట'లో 24 ఏళ్ల సామ్ కరన్ను రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటు పలికిన ప్లేయర్గా సామ్ కరన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ పేరిట ఉంది. 2021లో జరిగిన మినీ వేలంలో మోరిస్ను రాజస్థాన్ జట్టు రూ.16.25కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడా రికార్డును శామ్ కరన్ బద్దలుకొట్టాడు.
వేలంలో మాత్రమే కాకుండా ఓవరాల్గా కూడా కరన్దే ఎక్కువ మొత్తం కావడం విశేషం. కోహ్లీని రిటైన్ చేసుకున్న బెంగళూరు.. కేఎల్ రాహుల్ కోసం లక్నో గరిష్టంగా రూ.17 కోట్లు మాత్రమే చెల్లించాయి. బంతితో పాటు బ్యాట్తో రాణించ గలిగే సత్తా సామ్కరన్కు ఉండటం.. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. ప్లేయర్ ఆఫద్ టోర్నీగా నిలవడం.. వయసు 24 ఏళ్లు మాత్రమే ఉండటంతో ఫ్రాంచైజీలు ఈ ఇంగ్లండ్ ఆల్రౌండర్ కోసం ఎగబడ్డాయి.
వేలంలో భారీ ధర పలకడంపై సామ్ కరన్ సంతోషం వ్యక్తం చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్, ఆమె తండ్రితో కలిసి వేలాన్ని వీక్షించానని తెలిపాడు. అయితే మెగా వేలం టీవీలో రాకపోవడంతో కాస్త కంగారు పడ్డానని, చివరకు ఒకరు లింక్ షేర్ చేయడంతో చూడగలిగానని చెప్పాడు. 'ఐపీఎల్ మినీ వేలం గురించి ఉదయం 9 గంటలకు తెలిసింది. కానీ టీవీలో ఈ మినీ ఆక్షన్ లైవ్ రాకపోవడంతో ఎలా చూడాలో అర్థం కాలేదు. చివరకు ఒకరు లింక్ షేర్ చేయడంతో నా గర్ల్ఫ్రెండ్, ఆమె తండ్రితో కలిసి వీక్షించాను. మాతో పాటు నా గర్ల్ ఫ్రెండ్ సోదరి, ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. చాలా పొద్దున్నే చూడటం ప్రారంభించడంతో నా పేరు వచ్చే వరకు కాస్త వేచి చూడాల్సి వచ్చింది.'అని సామ్ కరన్ పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ ట్వీట్ చేయగా.. భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యారేజ్ కన్ఫర్మ్డ్ అని బదులిచ్చాడు. ఈ ఐపీఎల్ వేలంలో పలికిన భారీ ధరతో సామ్ కరన్ పెళ్లి అయినట్లేనని సింపుల్గా చెప్పుకొచ్చాడు. కళ్లు బైర్లు కమ్మే ఈ ధర చూసిన తర్వాత సామ్ కరన్ మామ ఏంది ఎవ్వడైనా పిల్లనిచ్చేందుకు రెడీగా ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దొడ్డ గణేశ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.