రింకూ సింగ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతున్న పేరు. ఏ క్రికెట్ అభిమానిని కదిలించినా అతని ముచ్చటే. అతని సిక్స్లు.. మ్యాచ్లను ముగిస్తున్న తీరు గురించే చర్చ. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో బ్యాటింగ్కు వచ్చిన మూడు ఇన్నింగ్స్ల్లో రింకూ సింగ్ దుమ్మురేపాడు. తనకే సాధ్యమైన షాట్లతో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
వైజాగ్ వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రింకూ (22 నాటౌట్) ఆఖరి బంతికి సిక్స్ బాది గెలిపించాడు. తిరువనంతపురం టీ20లో విధ్వంసకర బ్యాటింగ్( 31 నాటౌట్)తో జట్టుకు భారీ స్కోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడో టీ20లో బ్యాటింగ్ అవకాశం రాకపోగా.. రాయ్పూర్ టీ20లో మిడిలార్డర్ విఫలమవ్వగా.. రింకూ సింగ్ 46 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న భారత్కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

ఈ నాలుగు ఇన్నింగ్స్లు అతని స్థాయిని పెంచాయి. రింకూ సింగ్ను చూస్తుంటే తనకు ధోనీ గుర్తొస్తున్నాడని టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అనేలా చేసాయి. సూర్యనే కాదు.. ప్రతీ క్రికెట్ అభిమాని ఇదే చెబుతున్నారు. కోల్కతా నైట్రైడర్స్ తరఫున 5 బంతుల్లో 5 సిక్స్లు బాది సంచలన విజయాన్ని అందించినప్పుడే రింకూ సింగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
అయితే ఆ ప్రదర్శనకే పరిమితమవ్వకుండా రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి రింకూ సింగ్ చాలా కష్టపడ్డాడు. చాలా నిరుపేద కుటుంబం నుంచి క్రికెటర్గా ఎదిగిన రింకూ సింగ్.. కెరీర్ ఆరంభంలోనే బీసీసీఐ నిషేధానికి గురయ్యాడు. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడని 2019లో అతనిపై మూడు నెలలు నిషేధం విధించారు.
అబుదాబీలో టీ20 టోర్నమెంట్ ఆడేందుకు బోర్డు అనుమతి లేకుండా వెళ్ళినందుకు అతనిపై ఈ చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో రింకూ చాలా నిరాశకు గురయ్యాడు. రూల్స్ తెలియక ఈ తప్పిదం చేశాడు కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అయితే ఈ సంఘటన రింకూ క్రికెట్ను అంతగా ప్రభావితం చేయలేదు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి కేకేఆర్ దృష్టిని ఆకర్షించాడు.
ముంబయి మాజీ బ్యాటర్, కోల్కతా నైట్రైడర్స్ సహాయ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ రింకూ సింగ్కు ఎంతో అండగా నిలిచాడు. ప్రత్యేకంగా అతనికి కోచింగ్ ఇచ్చి మేటీ బ్యాటర్ అయ్యేలా చేశాడు. గాయాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మేనేజ్మెంట్ను ఒప్పించి రిటైన్ చేసుకునేలా చేశాడు. కోచ్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా రింకూ సింగ్ చెలరేగుతున్నాడు. రింకూ ఇలానే కొనసాగితే టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాకు కీలకం కానున్నాడు.