వర్షంతో క్రికెట్ మ్యాచ్లు రద్దయినా.. ఆగిపోయినా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారు. ఈ మధ్య క్రికెట్ మ్యాచ్లపై వరణుడు పగబట్టాడు. భారత్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో ఇప్పటికే కొన్ని కీలక మ్యాచ్లను మింగేసిన వరుణుడు.. ఆస్ట్రేలియా పర్యటనలో భారత టీ20 మ్యాచ్ను కూడా ముంచేసాడు. అయితే వర్షంతో మ్యాచ్లు రద్దయినప్పుడు.. అప్పటి వరకు ఆటగాళ్లు చేసిన పరుగులు, తీసిన వికెట్లు ఇతర గణంకాలను రికార్డుల్లోకి తీసుకుంటారా? లేక పక్కనపెడుతారా? ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రూల్స్ ఎలా ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకుందా?
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా.. ఫలితం తేలకుండా ముగిసినా.. అప్పటి వరకు ఆటగాళ్లు చేసిన పరుగులు, తీసిన వికెట్లు, పట్టిన క్యాచ్లు అన్నీ గణంకాలను లెక్కలోకి తీసుకుంటారు. బ్యాటింగ్ యావరేజ్, బౌలింగ్ యావరేజ్ గణంకాలను లెక్కించేటప్పుడు.. నాటౌట్గా పరిగణలోకి తీసుకుంటారు. ఇది ఆటగాళ్ల యావరేజ్ను మరింత మెరుగుపరుస్తుంది.

ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(19) ఔటవ్వగా.. శుభ్మన్ గిల్(37 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(39 బ్యాటింగ్) అజేయంగా నిలిచారు. నాథన్ ఎల్లిస్కు ఒక్క వికెట్ దక్కింది.
ఎంతకీ వర్షం ఆగకపోవడంతో పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దాంతో ఈ తొలి టీ20 ఫలితం తేలని మ్యాచ్గా రికార్డ్కెక్కింది. మరోవైపు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ చేసిన పరుగులు తమ వ్యక్తిగత రికార్డుల్లో నమోదవ్వగా.. నాథన్ ఎల్లిస్ వికెట్ కూడా రికార్డుకెక్కింది. మ్యాచ్ రద్దయినా ఆటగాళ్ల గణంకాలు రికార్డ్కు ఎక్కుతాయి. వర్షంతో ఆగిపోయిన మ్యాచ్ల్లో బ్యాటర్లు సెంచరీ చేసినా.. డకౌట్ అయినా రికార్డుల్లో చేర్చుతారు. సాధారణ మ్యాచ్లానే పరిగణిస్తారు. కానీ ఫలితం తేలని మ్యాచ్గా పేర్కొంటారు.