ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియాకు ఏది కలిసి రాలేదు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ నుంచి డీఎల్ఎస్(డక్వర్త్ లూయిస్) లెక్కల వరకు ఏదీ శుభ్మన్ గిల్ సేనకు కలిసి రాలేదు. ఓవర్కాస్ట్ కండీషన్స్లో టాస్ ఓడిపోవడం టీమిండియాకు నష్టం చేస్తే.. వరణుడు పూర్తిగా ముంచేసాడు. అర్థం పర్థం లేని డీఎల్ఎస్ లెక్కలు భారత్ పోరాటాన్ని నీరుగార్చాయి.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0), శుభ్మన్ గిల్(10) వికెట్లు కోల్పోయింది. ఓవర్కాస్ట్ కండిషన్స్ను అడ్వాంటేజ్గా మార్చుకున్న ఆసీస్ బౌలర్లలో తొలి పవర్ ప్లేలో నిప్పులు చెరిగారు. మరోవైపు వన్డే ఫార్మాట్ తరహాలో భారత్ నిదానంగా ఆడింది. కానీ పదే పదే వర్షం అంతరాయం కలిగించడం.. గంటల తరబడి ఆట ఆగిపోవడంతో 50 ఓవర్ల మ్యాచ్ కాస్త 26 ఓవర్ల గేమ్గా మారిపోయింది. కానీ ఈ నిర్ణయం తీసుకునేసరికే భారత్ అప్పటికే 16. 4 ఓవర్లు ఆడేసింది.

4 వికెట్లు కోల్పోయి 52 పరుగులే చేసింది.దాంతో చివరి 9.2 ఓవర్లలో టీమిండియా దూకుడుగా ఆడాల్సి వచ్చింది. ఈ ప్రయత్నంలో భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరకు కేఎల్ రాహుల్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 38), అక్షర్ పటేల్(38 బంతుల్లో 3 ఫోర్లతో 31), నితీష్ కుమార్ రెడ్డి(11 బంతుల్లో 2 సిక్సర్లతో 19 నాటౌట్) సాయంతో నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది.
ఆసీస్ ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్(6 ఓవర్లు), జోష్ హజెల్ వుడ్(7 ఓవర్లు), నాథన్ ఎల్లిస్(5 ఓవర్లు) ఎక్కువ ఓవర్లు వేసి టీమిండియాకు చేయాల్సిన నష్టం చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో డీఎల్ఎస్ లెక్కలు రావడంతో భారత్కు తీవ్ర నష్టం జరిగింది. భారత్ విధించిన లక్ష్యం కాస్త డీఎల్ఎస్ లెక్కల ప్రకారం 136 నుంచి 131గా మారింది.
వర్షం కారణంగా ఓవర్లు తగ్గినప్పుడు, DLS పద్ధతిన లక్ష్యాన్ని నిర్దేశించేటప్పుడు రన్రేట్తో పాటు రెండు జట్లకు మిగిలి ఉన్న వికెట్లు, ఓవర్లను పరిగణలోకి తీసుకుంటారు. టీమిండియా 9 వికెట్లు కోల్పోవడంతో లక్ష్యం తగ్గింది. వన్డే ఫార్మాట్ వ్యూహంతో బ్యాటింగ్ ప్రారంభించి.. వర్షం కారణంగా భారత తమ అప్రోచ్ను మార్చుకోగా.. ఆసీస్ మాత్రం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే లక్ష్యం దిశగా ఆడింది. దాంతోనే డీఎల్ఎస్ లెక్కలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అన్యాయమని ఈ రూల్ను కూడా మార్చాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డీఎల్ఎస్ రూల్స్ పూర్తిగా ఆసీస్కు కలిసొచ్చాయని కామెంట్ చేస్తున్నారు.