ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ డక్ వర్త్ లూయిస్ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0), శుభ్మన్ గిల్(10), శ్రేయస్ అయ్యర్ (11)వైఫల్యంతో పాటు వర్షం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ 8 పరుగులే చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో భారత్ గెలిస్తేనే ఈ సిరీస్ అవకాశాలు సజీవంగా ఉండనున్నాయి. ఈ మ్యాచ్లో ఓడితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ఆసీస్ కైవసం అవుతుంది. ఈ క్రమంలోనే అడిలైడ్ వన్డే గెలవాలనే కసితో టీమిండియా ఉంది.

ఈ మ్యాచ్ కోసం సోమవారమే టీమిండియా పెర్త్ నుంచి అడిలైడ్ బయలుదేరింది. సోమవారం దీపావళి కావడంతో భారత అభిమానులు ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున అడిలైడ్ విమానాశ్రయం చేరుకొని భారత ఆటగాళ్లకు స్వాగతం పలికారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నామస్మరణతో అడిలైడ్ స్టేడియం దద్దరిల్లింది.
తొలి వన్డేలో దారుణంగా విఫలమైనా.. రోహిత్, కోహ్లీల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వారిపై అభిమానులు తమ ప్రేమను చూపించారు. ముఖ్యంగా కోహ్లీ డకౌట్ అయినా ఏ మాత్రం నిరాశ చెందలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆసీస్ గడ్డపై మెరుగైన గణంకాలు ఉన్న విరాట్ కోహ్లీ తొలిసారి డకౌటయ్యాడు. వన్డేల్లో 13 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కోహ్లీ డకౌటయ్యాడు. రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించాలంటే ఈ ఇద్దరూ ఆటగాళ్లు చెలరేగడం కీలకం.
రెండో వన్డేలో టీమిండియా తమ కాంబినేషన్లో స్వల్ప మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేకు దూరంగా ఉంచిన రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను బరిలోకి దించే ఛాన్స్ ఉంది. అతను జట్టులోకి వస్తే వాషింగ్టన్ సుందర్పై వేటు పడనుంది.