
హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై 5-0తో టీ20 సిరీస్ నెగ్గి టీమిండియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆద్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన కోహ్లీసే ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ముఖ్యంగా ఓడే మ్యాచ్ల్లో కూడా ఆఖరి బంతి వరకు పట్టువదలకుండా పోరాడి విజయాన్నందుకుంది. ఇక ఒత్తిడికి చిత్తయిన ఆతిథ్య జట్టు క్లీన్ స్వీప్ అయిన అప్రతిష్టను మూటగట్టుకుంది.
ఈ సిరీస్ విజయంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. తన అద్భుత బౌలింగ్తో ఓడే మ్యాచ్లను సైతం భారత్వైపు తిప్పాడు. ముఖ్యంగా చివరి మ్యాచ్లో అతని బౌలింగ్ ఆసాధారణం. 4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇందులో ఒకటి మెయిడిన్ ఉండటం విశేషం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బుమ్రాపై బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ప్రశంసల జల్లు కురిపించింది. తనని మ్యాచ్ విన్నర్ ఎవరో చెప్పమంటే ఏమాత్రం ఆలోచించకుండా బుమ్రా పేరే చెప్తానని ఈ బాలీవుడ్ బామ తెలిపింది.
ఇక తన అప్కమింగ్ మూవీ 'మలంగ్'ప్రమోషన్స్లో భాగంగా చివరి టీ20కు ముందు దిశా పటాని.. అధికారిక బ్రాడ్కాస్టర్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొంది. తాజాగా ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించింది.
'మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ను పిక్ చేయమంటే నేను బుమ్రా పేరే చెబుతా. అతనో అద్భుతమైన ఆటగాడు. కివీస్ను బుమ్రా కట్టడి చేయడం, భారత్ గెలవడం గర్వించదగిన విషయం.'అని ఈ బాలీవుడ్ భామ పేర్కొంది. ఇక ఆమెతో ప్రీ మ్యాచ్ షోలో పాల్గొన్న వెటరన్ యాక్టర్ అనిల్ కపూర్ మాత్రం కోహ్లీని కొనియాడాడు.
అందరికి కోహ్లీనే బాస్ అని, క్రికెట్పై అతనికున్న ప్యాషన్ ప్రతీ ఒక్కరిని ఆకర్షిస్తుందని తెలిపాడు. మలంగ్ టీమ్ భారత్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుందని చెప్పుకొచ్చాడు. ఇక మహేంద్ర సింగ్ ధోని బయోగ్రఫీ 'ధోని అన్టోల్డ్ స్టోరీ'తో సక్సెసెస్ను అందుకున్న ఈ భామ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.