శ్రీలంక పర్యటనలో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. కోహ్లీని వెనకేసుకురావడం లేదని, స్పిన్ కండిషన్స్లో బ్యాటింగ్ చేయడం కష్టమని తెలిపాడు.
ఇటీవ శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 0-2తో కోల్పోయింది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ సిరీస్లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ ఒక్కడే రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

విరాట్ కోహ్లీ 3 మ్యాచ్ల్లో కలిపి 58 రన్స్ చేశాడు. అంతేకాకుండా ఈ మూడు మ్యాచ్ల్లో స్పిన్ బౌలింగ్ ఆడలేక ఎల్బీగానే వెనుదిరిగాడు. తాజాగా భారత బ్యాటర్ల వైఫల్యంపై స్పందించిన దినేశ్ కార్తీక్ వారికి అండగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో భారత బ్యాటర్ల ఫామ్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.
'ఈ సిరీస్లో కఠినమైన పిచ్పై స్పిన్నర్లను ఎదుర్కొవడం బ్యాటర్లకు కష్టమే. ముందుగా దాన్ని అందరూ అంగీకరించాల్సిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మరే బ్యాటర్ అయినా.. పాతబడిన బంతితో స్పిన్ వికెట్పై ఆడటం కష్టం. ముఖ్యంగా 8 నుంచి 30 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేయలేం. ఈ క్రమంలోనే భారత బ్యాటర్ల వైఫల్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నా. అన్ని పిచ్లు ఈ విధంగానే ఉండవు. కానీ స్పిన్నర్లను ఎదుర్కొవడానికి ఇది కఠినమైన పిచ్. నేను విరాట్ కోహ్లీని వెనకేసుకురావడం లేదు. కానీ స్పిన్ ఆడటం చాలా కష్టమని చెప్పగలను.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డేను టీమిండియా టై చేసుకుంది. విజయానికి ఒక్క పరుగు దూరంలో చివరి రెండు వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. రెండో వన్డేలో జెఫ్రీ వాండర్సే ఆరు వికెట్లతో చెలరేగడంతో ఓటమిపాలైంది. మూడో వన్డేలో దునిత్ వెల్లలాగే ఐదు వికెట్ల ధాటికి ఘోర పరాజయాన్ని చవి చూసి సిరీస్ కోల్పోయింది. 27 ఏళ్ల తర్వాత స్వదేశంలో భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచింది.