టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది వాషింగ్టన్ సుందర్ కెరీర్కే ప్రమాదమని హెచ్చరించాడు. సౌతాఫ్రికాతో కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్పై భారత బ్యాటర్లు తేలిపోయారు.
టీమిండియా స్పిన్ వికెట్ను తయారు చేయించుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాలుగో స్పిన్నర్గా జట్టులోకి తీసుకున్న వాషింగ్టన్ సుందర్ను బ్యాటర్గా వాడుకుంది. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు పంపించింది. మిగతా బ్యాటర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేసినా.. అతను బౌలింగ్ చేయలేదు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా సుందర్ను బ్యాటర్గా ఆడించడంపై దినేశ్ కార్తీక్ ఘాటుగా స్పందించాడు. ఇది సుందర్ కెరీర్కే ప్రమాదమని అభిప్రాయపడ్డాడు.

'టెస్ట్ క్రికెట్లో వాషింగ్టన్ సుందర్ను ఎలా చూస్తున్నారు? బ్యాటింగ్ ఆల్రౌండర్గా? లేక బౌలింగ్ ఆల్రౌండర్గా? అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపించారు. బ్యాటింగ్పై ఎక్కువ ఫోకస్ పెట్టాలని పరోక్షంగా సూచిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగిస్తే అతను పూర్తిగా బ్యాటింగ్పైనే ఫోకస్ పెడుతాడు. అది అతని బౌలింగ్పై ప్రభావం చూపుతుంది. అతని బౌలింగ్ నాణ్యతను దెబ్బతీస్తోంది. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రాణించగలడు. కానీ అతన్ని బ్యాటర్గా ప్రమోట్ చేస్తే రెండింట్లో రాణించలేడు. మరిన్ని మ్యాచ్ల్లోనూ సుందర్ను మూడో స్థానంలో ఆడిస్తే అతని బౌలింగ్ దెబ్బతింటుంది. అది అతనికి కెరీర్కే ప్రమాదం.'అని దినేశ్ కార్తీక్ హెచ్చరించాడు.
ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ శనివారం నుంచి గౌహతి వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి కాంబినేషన్తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది.