ఆర్సీబీ కల నెరవేరింది. విరాట్ కోహ్లీ అలుపెరగని కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. కోట్లాది మంది అభిమానుల బెంగ తీరింది. 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ ఒక్క క్షణం రానే వచ్చింది. ఈ గెలుపు కేవలం ఆర్సీబీ జట్టుదే కాదు. 18 ఏళ్లుగా ఆ జట్టు కోసం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న అభిమానులది. వెనకుండి.. వెన్ను తట్టి.. పట్టు బట్టి.. టీమ్ను ముందుకు నడిపించిన మెంటార్ దినేశ్ కార్తీక్ది కూడా. ఈ అద్భుతమైన విజయంలో దినేశ్ కార్తీక్ పాత్ర అమోఘం. అతని అకితభావం అనిర్వచనీయం.
బాగా ట్రోల్ చేశారు..
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం తర్వాత ఆర్సీబీ జట్టును చూసి క్రికెట్ విశ్లేషకులతో పాటు ఆ జట్టు అభిమానులు కూడా నిట్టూర్చారు. ఈ జట్టుతో టైటిల్ గెలవడం దేవుడెరుగు.. ప్లే ఆఫ్స్ చేరితే గొప్ప అన్నట్లు ట్రోల్ చేశారు. వేలంలో ఆర్సీబీ టీమ్ నిద్రపోయిందంటూ మండిపడ్డారు. జితేశ్ శర్మకు రూ. 11 కోట్లు , జోష్ హజెల్ వుడ్కు రూ. 12.5 కోట్లు, ఫిల్ సాల్ట్కు రూ. 11.5 కోట్లు, లివింగ్ స్టోన్కు రూ. 11.5 కోట్లు, భువనేశ్వర్ కుమార్కు రూ. 11.75 కోట్లు, కృనాల్ పాండ్యాకు రూ. 5.75 కోట్లు ఎందుకంటూ ప్రశ్నించారు. కానీ ఈ ఆటగాళ్లందరి ఎంపిక వెనుక దినేశ్ కార్తీక్ ఉన్నాడు. పట్టుబట్టి మరి కొనుగోలు చేశాడు.

సరైన ప్రణాళికలతో..
జట్టు ఎంపిక గురించి ఆర్సీబీ బోల్డ్ డైరీస్లో దినేశ్ కార్తీక్ చెప్పిన విషయాలు వింటే ఈ విషయం స్పష్టమవుతోంది. పకడ్బందీ ప్రణాళికతో దినేశ్ కార్తీక్ వేలంలో పాల్గొన్నాడు. జట్టు విజయానికి కావాల్సిన ఆటగాళ్లు ఎవరు? వారు దక్కకుంటే బ్యాకప్ ఎవరూ? అనే లిస్ట్ రాసుకొని మరి వెళ్లాడు. పవర్ ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగే ఫిల్ సాల్ట్, అత్యధిక స్ట్రైక్రేట్ కలిగిన జితేశ్ శర్మ.. నిద్రలో నుంచి లేచి వచ్చినా సరైన్ లెంగ్త్లో బౌలింగ్ చేయగల జోష్ హజెల్ వుడ్.. మరో ఎండ్లో సహకారం లభిస్తే రెచ్చిపోయే భువనేశ్వర్ కుమార్లను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని కొనుగోలు చేశాడు.
సుయాశ్, కృనాల్ పాండ్యాలతో స్పిన్ విభాగాన్ని పటిష్టం చేశాడు. టీమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్లను ఫినిషర్లుగా ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక్కడితోనే టైటిల్ రాదని గ్రహించిన దినేశ్ కార్తీక్.. సమష్టి ప్రదర్శన కనబర్చే జట్టును తయారు చేయాలనుకున్నాడు. తాను కావాలనుకున్న ఆటగాళ్ల కోసం పట్టుబట్టి మేనేజ్మెంట్ను ఒప్పించాడు.
కోచ్గా అండగా నిలుస్తూ..
జట్టు ఎంపికనే కాదు.. ఆటగాళ్ల బలహీనతలను గుర్తించి వారిని సరిదిద్దడంలోనూ దినేశ్ కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో పేలవ ఫామ్లో ఇబ్బంది పడుతున్న తనకు దినేశ్ కార్తీక్ సలహాలు ఉపయోగపడ్డాయని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మాటలను బట్టే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. జితేశ్ శర్మను కూడా ముందుండి నడిపించాడు. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేశాడు. యశ్దయాళ్ను అతను తీర్చిదిద్దిన తీరు అమోఘం. ఆశిష్ నెహ్రా తరహాలో బౌండరీ లైన్ వెంటనే ఉంటూ.. దినేశ్ కార్తీక్ కీలక సలహాలు ఇచ్చాడు. మొత్తానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆర్సీబీకి మరిన్ని టైటిల్స్ అందించడమే అతని ముందున్న ప్రధాన లక్ష్యం.