
బ్యాటింగ్ వైఫల్యమే..
ఈ ఓటమిపై స్పందించిన దినేశ్ కార్తీక్.. వరుస విజయాలతో జట్టులోని లోపాలు బయపడయని తెలిపాడు. ఒక్క ఓటమితో జట్టు బలహీనతలన్నీ బయటకు వస్తాయని చెప్పాడు. 'ఇండోర్ టెస్ట్లో టీమిండియా ఓటమికి ఎన్నో కారణాలు చెప్పవచ్చు. అయితే భారత బ్యాటర్లు విఫలమవుతున్నారనే నిజాన్ని మాత్రం దాచిపెట్టలేం. టాపార్డర్లో ఏడుగురు బ్యాటర్లు ఉన్నా.. ఒక్కరు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో పాటు జట్టుకు కావాల్సిన పరుగులు చేయలేకపోతున్నారు.

స్పిన్ పిచ్లపై ఆడకపోవడం..
స్పిన్ పిచ్ల మీద భారత ఆటగాళ్లు తడబడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారత్లో దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్లకు ఇలాంటి పిచ్ కొత్తేమీ కాదు. అయితే క్రీజులో ఎక్కువ సేపు ఉండాలనే ఆలోచన భారత బ్యాటర్లలో కనిపించడంలేదు. పిచ్ బ్యాటింగ్కు కష్టంగా మారినప్పుడే ఆ బ్యాటర్ సత్తా ఏంటో బయటికి తెలుస్తోంది. ఇంతకంటే కఠినమైన పిచ్లో ఆడి గెలిచిన చరిత్ర భారత్కు ఉంది. ఓ వికెట్ పడగానే మిగిలిన బ్యాటర్లలో భయం మొదలవుతోంది. పిచ్లో ఏదో ఉంది, కష్టంగా ఉందనే మైండ్సెట్లోకి వెళ్లిపోయి ఆత్మ రక్షణలో ఆడుతున్నారు. ఇదే త్వరగా వికెట్ కోల్పోవడానికి కారణం అవుతోంది.

అటాకింగ్ గేమ్తో..
ఒత్తిడిని దూరం చేసుకోవడానికి పెద్ద షాట్స్ ఆడటం ఒక్కటే మార్గంగా భావిస్తున్నారు. ప్రతీసారి అటాకింగ్ గేమ్ పని చేయదు. ఈ సిరీస్లో కేవలం లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం వల్లే టీమిండియా విజయం సాధించింది. మొదటి రెండు టెస్టుల్లో అదే జరిగింది. మ్యాచులు గెలుస్తున్నంతకాలం లోపాలు ఎవ్వరికీ కనబడవు. కానీ ఒక్క ఓటమిలో అన్నీ లోపాలు బయటికి వస్తాయి. కొందరు ప్లేయర్లు పరుగులు చేయకపోయినా వారికి టీమ్లో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. టీమ్మేనేజ్మెంట్ వారికి అండగా నిలుస్తోంది. ఇది ముఖ్యమే. అయితే అన్ని వేళలా ఇదే కరెక్ట్ కాదు.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












