
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలోని కోహ్లీసేనకు వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో వికెట్ కీపింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. కీపింగ్, బ్యాటింగ్ కిట్కు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశాడు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు సమయం దగ్గరపడుతున్న వేళ టీమిండియాలో కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా పాజిటీవ్గా తేలారు. దాంతో వీరిద్దరిని ఐసోలేషన్లో ఉంచారు. అయితే దయానంద్కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, బ్యాట్స్మన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచారు.
ఈ ముగ్గురు కరోనా నెగటివ్గా తేలినప్పటికీ యూకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసోలేషన్కు పంపారు. దాంతో టీమిండియాకు చెందిన ఐదుగురు సభ్యులు ప్రస్తుతం లండన్లో ఐసోలేషన్లో ఉన్నారు. ఇక 20 రోజుల విశ్రాంతిని పూర్తి చేసుకున్న మిగతా జట్టు సభ్యులు డర్హమ్ బయలుదేరారు. ఇంగ్లండ్ సిరీస్కు సన్నాహాకంగా బీసీసీఐ డర్హమ్లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 20వ తేదీ నుంచి కౌంటీ ఎలెవన్ టీమ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్కు 15 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. అయితే ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఐసోలేషన్లోనే ఉండటంతో ప్రాక్టీస్ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మారింది
జట్టులో ఉన్న కేఎల్ రాహుల్కు వికెట్ కీపింగ్ సామర్థ్యం ఉంది. వన్డే, టీ20ల్లో కీపింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇంగ్లండ్తో మొదటి టెస్టులోపు పంత్, సాహా జట్టులో చేరతారని జట్టు వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అవసరమైతే తాను సిద్ధంగానే ఉన్నానని దినేశ్ కార్తీక్ ట్విటర్ వేదికగా ఆఫర్ ఇచ్చాడు. క్రికెట్ కామెంటేటర్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను ఇంగ్లండ్లోనే ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'కేవలం గుర్తుచేస్తున్నా' అంటూ కిట్బ్యాగు, గ్లోవ్స్చిత్రాలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తుంది.