
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నడిపించనున్నారని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్కు కెప్టెన్గా ఎంపిక అయిన హార్దిక్ పాండ్యా.. వన్డే ఫార్మాట్లో వైస్ కెప్టెన్సీ అందుకున్నాడు. కేఎల్ రాహుల్ను కాదని హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. దాంతో రోహిత్ తర్వాత టీమిండియాను నడిపించేది హార్దిక్ పాండ్యానేనని హింట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్ సైతం భారత జట్టును రోహిత్ తర్వాత హార్దిక్ నడిపిస్తాడని చెప్పాడు.
ఇప్పటికే కెప్టెన్సీ సామర్థ్యం ఏంటో హార్దిక్ పాండ్యా నిరూపించుకొన్నాడని, తప్పకుండా రోహిత్ తర్వాత అతడే సారథి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కార్తిక్ తెలిపాడు. ''ఈ ఏడాది చాలామంది ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే అందరిలోకెల్లా పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తానెంటో నిరూపించుకొన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ను విజేతగా నిలిపాడు. అందుకే రోహిత్ శర్మ తర్వాత వైట్బాల్ క్రికెట్కు నాయకుడిగా అయ్యే అవకాశాలు కేఎల్ రాహుల్ కంటే హార్దిక్ పాండ్యాకే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే వైస్ కెప్టెన్సీ రేసులో కేఎల్తో పాండ్యా పోటీ పడుతున్నాడు. ప్రపంచకప్ జట్టుకు తప్పకుండా రోహిత్కు డిప్యూటీగా పాండ్యానే ఉంటాడు. హార్దిక్ పాండ్యా ప్రదర్శన కూడా అత్యుత్తమ స్థాయిలో ఉంది'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్గా వచ్చిన తర్వాత భారత్ జట్టుకు చాలా మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. దాదాపు ఏడాదిలో 8 మంది సారథ్యం వహించారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్తో పాటు గాయాలతో రోహిత్ శర్మ పలు సిరీస్లకు దూరమవ్వడంతో కొత్త కెప్టెన్లను చూడాల్సి వచ్చింది.
శ్రీలంక జట్టుతో వన్డేలు ఆడినప్పుడు శిఖర్ ధావన్ సారథ్యం చేపట్టాడు. ఇలా ఒకే ఏడాది ధావన్, హార్దిక్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే విభిన్నంగా ప్రయోగాలు చేయడం పెద్ద టోర్నీల్లో టీమిండియా విఫలం కావడానికి ప్రధాన కారణమైందని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో రాబోయే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వరకు ఎలాంటి ప్రయోగాలు చేపట్టకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.