
న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టును వణికిస్తాడని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. కొన్ని రోజులు పంత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, ఒత్తిడి సమయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. తాజాగా ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో రిషభ్ పంత్ కీలకం అవుతాడని తెలిపాడు. అంతేకాకుండా పంత్.. టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడాలని ఆకాంక్షించాడు.
'పంత్కున్న పరిమిత నైపుణ్యాలతో ఎక్కువ పరుగులు సాధిస్తాడు. అతను ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టిస్తాడు. తన సాహసోపేతమైన షాట్లతో మైదానం నలువైపులా ఫీల్డర్లను విస్తరించేలా చేస్తాడు. అయినా, అతను పరుగులు సాధిస్తాడు. అది ఎలాంటి మ్యాచ్ అయినా దంచికొడుతూనే ఉంటాడు. అతనో ప్రత్యేకమైన ఆటగాడు. టీమిండియాకు నిలకడగా విజయాలు అందిస్తూ అత్యున్నత శిఖరాలకు చేరుకుంటాడు' అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ఇక, పంత్ కొద్ది నెలలుగా నిజంగానే అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అతను ఆస్ట్రేలియా పర్యటనలో కీలక సమయంలో రెచ్చిపోవడంతో భారత్ వరుసగా రెండోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నిలబెట్టుకుంది. ముఖ్యంగా బ్రిస్బేన్ వేదికగా పంత్ ఆడిన విన్నింగ్ ఇన్నింగ్స్ అతని కెరీర్లోనే ది బెస్ట్. అనంతరం ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లోనూ సెంచరీతో చెలరేగి మరోసారి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లిన పంత్.. మెగా పోరు కోసం సమాయత్తం అవుతున్నాడు. అతను గనుక ఫామ్ కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు.