
అసలేం జరిగిందంటే...?
పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. విజయ లాంఛనాన్ని పూర్తి చేయాల్సిన దినేశ్ కార్తీక్ ఒత్తిడికి చిత్తయ్యాడు. చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు కావాల్సిన స్థితిలో తొలి బంతికి హార్దిక్ పాండ్యా ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చాడు. సింగిల్ తీసి విరాట్కు స్ట్రైక్ ఇవ్వగా.. అతను ఓ సిక్సర్తో పాటు మూడు పరుగులు తీసాడు. దాంతో దినేశ్ కార్తీక్ స్ట్రైక్లోకి రాగా.. భారత విజయానికి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆడాల్సిన కార్తీక్.. ఒత్తిడి తట్టుకోలేక వైడ్ బాల్ ఆడి స్టంపౌటయ్యాడు. దాంతో భారత్ విజయానికి చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి.

అశ్విన్ మైండ్ గేమ్..
దాంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరగా.. క్రీజులోకి వచ్చిన అశ్విన్ మాత్రం తన తెలివిని ప్రదర్శించాడు. తాను కూడా ఓ స్పిన్నర్ కావడంతో మహమ్మద్ నవాజ్ వ్యూహాన్ని పసిగట్టాడు. తనను కూడా దినేశ్ కార్తీక్ తరహాలో వైడ్ బాల్కు బోల్తా కొట్టిస్తాడని గ్రహించాడు. వికెట్లను వదిలి స్ట్రైక్ తీసుకున్న అతను బంతి పడగానే దాన్ని గమనాన్ని గమనించి లోపలికి జరిగాడు. దాంతో ఆ బంతి కాస్త వైడ్గా మారి భారత్కు అదనపు పరుగు లభించింది. దాంతో చివరి బంతికి సింగిల్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్క రన్ ఆపేందుకు పాక్ ఫీల్డర్లంతా సర్కిల్ లోపలికి రాగా.. అశ్విన్ మాత్రం.. సింపుల్గా లాంగాఫ్లో లాఫ్టెడ్ షాట్తో సింగిల్ తీసి మ్యాచ్ను ఈజీగా గెలిపించాడు. అశ్విన్ ఏ మాత్రం ఏమరపాటుకు గురైనా కోట్లాది మంది హృదయాలు ముక్కలయ్యేవి. కార్తీక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనేవాడు.
కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ..
ఈ క్రమంలోనే అశ్విన్కు కార్తీక్ ధన్యవాదాలు తెలిపాడు. నెదర్లాండ్స్తో తదుపరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిడ్నీ చేరుకోగా.. బీసీసీఐ ఈ క్షణాలను వీడియో తీసింది. దీన్ని గమనించి కార్తీక్.. బహిరంగంగా అశ్విన్కు ధన్యవాదాలు తెలిపాడు. 'నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అశ్విన్'అంటూ చెప్పుకొచ్చాడు. ఫలితం అటు ఇటు అయినా కార్తీక్ కెరీర్ ముగిసేది. టీమ్మేనేజ్మెంట్ సైతం తీవ్ర విమర్శలు ఎదుర్కొనేది.


Click it and Unblock the Notifications
