ఓవైపు ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫోకస్ పెట్టగా.. మరోవైపు ఫ్రాంచైజీలు మెగా ఆక్షన్లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. రిటెన్షన్ ప్రక్రియకు సంబంధించిన రూల్స్ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే పది ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.. వారి సలహాలు సూచనలు తీసుకుంది.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ను వీడనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన తనను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని అభిషేక్తో రోహిత్ అన్నాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా దుమారం రేపింది. బ్రాడ్కాస్టర్స్పై రోహిత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా ముంబై ఇండియన్స్ రిటెన్షన్కు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
ఇతర జట్ల కెప్టెన్సీ ఆఫర్స్ నేపథ్యంలోనే ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ను వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రోహిత్ శర్మకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ల నుంచి కెప్టెన్సీ ఆఫర్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులోకి కూడా రోహిత్ శర్మ వెళ్లే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఇదే విషయాన్ని ఆర్సీబీ మాజీ ప్లేయర్, టీమ్ మెంటార్ దినేశ్ కార్తీక్ను ప్రశ్నించగా.. అతను తనదైన శైలిలో రియాక్షన్ ఇచ్చాడు. క్రిక్ బజ్ ఇంటరాక్షన్లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన కార్తీక్ను ఓ అభిమాని రోహిత్ శర్మ గురించి ప్రశ్నించాడు. ఆర్సీబీ కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించాడు. దీనికి కార్తీక్ ఆశ్చర్యకరంగా రియాక్షన్ ఇస్తూ.. మౌనంగా ఉండిపోయాడు. దాంతో వేలంలో రోహిత్ శర్మను కొనుగోలు చేసే ప్రయత్నం ఆర్సీబీ చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.