ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు టీమిండియా సిద్దమైంది. శుక్రవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కోచ్గా గంభీర్కు ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా.. టెస్ట్ క్రికెట్లో ఘోర పరాజయాలను చవిచూసింది.
గంభీర్ పర్యవేక్షణలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. ఈ వరుస పరాజయాలతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను చేజార్చుకుంది. ఈ క్రమంలోనే గంభీర్ కోచింగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

తాజాగా గంభీర్ కోచింగ్ గురించి మాట్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యూహాలు రచించడంలో కోచ్గా గంభీర్కు తిరుగులేదని, కానీ ఆటగాళ్లను సరిగ్గా మేనేజ్చేయలేకపోతున్నాడని, ఇదే అతని కోచింగ్లో లోపంగా మారిందన్నాడు. ఈ ఒక్క విషయాన్ని గంభీర్ సరిచేసుకోవాల్సిందన్నాడు.
'వ్యూహాత్మకంగా గౌతమ్ గంభీర్ చాలా మంచి కోచ్. ఆటగాళ్లను మేనేజ్ చేసే విషయంపై అతను మరింత ఫోకస్ పెట్టాలి. కానీ అతని గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే.. తన ఆటగాళ్ల కోసం ఎదురు చూస్తాడు. అయితే కెప్టెన్గా దూకుడుగా ఉన్నట్లు కోచ్గా ఉంటానంటే కుదురదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కోచ్గా విభిన్నమైన వ్యక్తులను నడిపించాల్సి ఉంటుంది. వారు మెరుగైన ప్రదర్శన చేస్తారని నమ్మి మైదానంలోకి పంపించాల్సి ఉంటుంది. కోచ్గా ఇది అతిపెద్ద సవాల్'అని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికే జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న గంభీర్.. సీనియర్ ఆటగాళ్లందర్నీ ఒక్కొక్కరిగా జట్టుకు దూరం చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో అతను విజయాలు సాధించకపోతే ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.