
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా యువ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరుపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి సూర్య బలయ్యాడు. దాంతో ఈ తప్పిదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. మాజీ క్రికెటర్లతో సహా అభిమానులు సోషల్ మీడియా వేదికగా థర్డ్ అంపైర్పై దుమ్మెత్తిపోసారు.
సామ్ కరన్ వేసిన 14 ఓవర్ తొలి బంతిని తనదైన రివర్స్ స్వీప్ షాట్తో భారీ సిక్సర్ కొట్టిన సూర్య.. ఆ మరుసటి బంతిని కూడా అదే రీతిలో నటరాజ్ షాట్ ఆడాడు. అయితే బంతి ఫైన్ లెగ్లో ఉన్న డేవిడ్ మలన్ చేతిలో పడింది. కానీ అతను క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని, నిబంధనల మేరకు తాను ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన సాప్ట్ సిగ్నల్కు కట్టుబడి ఔటిస్తున్నానని తెలిపాడు. అయితే బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనబడుతున్నా అంపైర్ ఆధారం లేదనడం వివాదాస్పదమైంది.
టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, వీవీఎస్ లక్ష్మణ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం.. అంపైర్లకు సాఫ్ట్ సిగ్నల్గా 'నాకు తెలియదని చెప్పడం'ఎందుకులేదో తనకు అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు.
అయితే ఈ వివాదాస్పద నిర్ణయంపై ట్విటర్ వేదికగా స్పందించిన భారత వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. అంపైర్ నిర్లక్ష్యాన్ని వదిలెయ్యాలని అభిమానులకు సూచించాడు. సూర్య, రోహిత్, విరాట్ కోహ్లీతో ఉన్న ఓ ఫన్నీ మీమ్ను షేర్ చేసిన డీకే.. తనదైన శైలిలో రాసుకొచ్చాడు. 'ఈ రోజు మ్యాచ్ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ థర్డ్ అంపైర్ను కలుస్తారని చేసిన మీమ్ ఆకట్టుకుంటుంది. క్రికెట్లో అంపైరింగ్ కష్టమైన జాబ్ అవుతుంది. భారత్ మ్యాచ్ గెలిచింది కాబట్టి అతని నిర్లక్ష్యాన్ని వదిలేయండి'అని ట్వీట్ చేశాడు.
అయితే డీకే షేర్ చేసిన మీమ్లో సూర్య బుల్లెట్ బైక్ నడుపుతుండగా అతని వెనుకాల కూర్చున రోహిత్ తుపాకీ, కోహ్లీ బాంబు పట్టుకొని సీరియస్గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.