ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను టీమిండియా చేజేతులా చేజార్చుకుందని తెలిపారు. ఇప్పటికే భారత్ ఓటమికి గల కారణాలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు.
ఓలిపోప్ అసాధారణ ఇన్నింగ్స్ టీమిండియా ఓటమిని శాసించిందని అభిప్రాయపడ్డారు. అయితే వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మాత్రం రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ టీమిండియా ఓటమికి కారణమైందని చెప్పాడు. ఫీల్డ్ సెటప్లో రోహిత్ శర్మ చేసిన తప్పిదాలు ఇంగ్లండ్కు కలిసొచ్చాయని అభిప్రాయపడ్డాడు.

ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఫీల్డ్ సెటప్ సరిగ్గా లేదన్నాడు. 'టీమిండియా మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడింది. ఓలీ పోప్ క్రీజులో ఉన్నప్పుడు ఫీల్డింగ్లో అలా ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ టామ్ హార్ట్లే వంటి అరంగేట్ర ప్లేయర్ ఆడుతున్నప్పుడు కూడా అలాంటి ఫీల్డ్ సెట్ చేశారు.
అతను పరుగులు రాబడుతుంటే.. అడ్డుకోలేకపోయారు. రెండో ఇన్నింగ్స్లో హార్ట్లే 34 పరుగులు చేశాడు. అతని రన్సే టీమిండియా ఓటమికి బాటలు వేసాయి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి టాప్ స్పిన్నర్లను ఎదుర్కొని పరుగులు చేసే అవకాశం కల్పించడం ఏ మాత్రం సరికాదు'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 400 ప్లస్ పరుగులు చేయగానే టీమిండియా ఒత్తిడికి గురైందని చెప్పాడు. అది భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనబడిందన్నాడు. స్వదేశంలో గతంలో ఏ జట్టు కూడా రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయలేదన్నాడు. ఓలీ పోప్ అసాధారణ బ్యాటింగ్తో ఇంగ్లండ్ను గెలిపించాడని కొనియాడాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది. రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
దాంతో భారత్కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్తో 420 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యం నమోదైంది. కానీ భారత్ 202 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది.