
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో మళ్లీ చోటు దక్కించుకుంటానని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. తన ప్రతిభ మీద తనకు ఎలాంటి అనుమానం లేదని బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత కార్తీక్ టీమిండియాలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వన్డే జట్టు నుంచి తప్పించినా.. టీ20ల్లో మాత్రం పుష్కలమైన అవకాశాలున్నాయన్నాడు. ఐపీఎల్లో రాణిస్తే జట్టులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'టీ20ల్లో నా రికార్డు చాలా బాగుంది. మా ప్రణాళిక ప్రకారం వన్డే ప్రపంచకప్లో రాణించలేకపోయాం. నన్ను వన్డే జట్టును ఎందుకు తప్పించారో అర్థం చేసుకోగలను. అయితే, టీ20ల్లో మాత్రం నాకు మళ్లీ చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నా. ఇటీవల దేశవాళీ క్రికెట్లోనూ బాగా ఆడా. నా మీద నేను అనుమానపడాల్సిన అవసరం లేదు'అని కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఇక తన కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదొడుకులు తనను ధృడంగా తయారు చేశాయని, ఎన్నో విషయాలు నేర్పించాయన్నాడు. అలాగే ఐపీఎల్లో రాణిస్తే టీ20 ప్రపంచకప్లోనూ చోటు దక్కేందుకు అవకాశముంటుందని తనకు తెలుసునని ఈ తమిళనాడు క్రికెటర్ చెప్పుకొచ్చాడు. లాక్డౌన్ ముందు ఐపీఎల్ కోసం ఎంతో ప్రాక్టీస్ చేశానన్నాడు.
కరోనా వైరస్ను ప్రపంచం జయిస్తుందని దినేశ్ కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ పాజిటీవ్గానే ఉండాలని, ఐపీఎల్ జరుగుతుందో లేదోనని తానేం తీవ్రంగా ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు. ఇక కార్తీక్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు తన 15 ఏళ్ల కెరీర్లో కార్తీక్ భారత్ తరఫున 26టెస్టులు, 94వన్డేలు, 32 టీ20లు ఆడాడు.